- ఇండియాలోనే ఎఫ్ఏఎల్ నిర్మాణం
న్యూఢిల్లీ : సివిల్ హెలికాప్టర్లను నిర్మించడానికి టాటా గ్రూప్ ఫ్రాన్స్కు చెందిన ఎయిర్బస్తో ఒప్పందం కుదర్చుకుంది. స్థానిక అవసరాలకు అనుగుణంగా ఎయిర్బస్ టాటాకు హెలికాప్టర్లను తయారు చేసి ఇస్తుందని విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా శుక్రవారం తెలిపారు. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇండియా పర్యటన సందర్భంగా రెండు సంస్థలు హెచ్125 హెలికాప్టర్లను నిర్మించడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఫైనల్ అసెంబ్లీ లైన్ (ఎఫ్ఏల్) డీల్లో కాంపోనెంట్ అసెంబ్లీలు, ఏవియానిక్స్ మిషన్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ హార్నెస్ల ఇన్స్టాలేషన్, హైడ్రాలిక్ సర్క్యూట్లు, ఫ్లైట్ కంట్రోల్స్, డైనమిక్ కాంపోనెంట్స్, ఫ్యూయల్ సిస్టమ్ ఇంజన్ల ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఇది భారతదేశంలోని కస్టమర్లకు హెచ్125 పరీక్ష, అర్హత, డెలివరీ సేవలను కూడా అందిస్తుంది. ఎఫ్ఏఎల్ను నిర్మించడానికి 24 నెలలు పడుతుంది మొదటి 'మేడ్ ఇన్ ఇండియా' హెచ్125 ల డెలివరీలు 2026లో ప్రారంభమవుతాయి.
ఎఫ్ఏఎల్ లొకేషన్ను ఎయిర్బస్, టాటా గ్రూప్ సంయుక్తంగా నిర్ణయిస్తాయి. ‘‘దేశ నిర్మాణానికి హెలికాప్టర్లు కీలకం. ‘మేడ్- ఇన్ -ఇండియా’ సివిల్ హెలికాప్టర్ నమ్మకమైన కొత్త ఇండియాకు చిహ్నంగా ఉంటుంది. దేశంలో హెలికాప్టర్ మార్కెట్ నిజమైన సామర్థ్యాన్ని వెలికితీస్తుంది” అని ఎయిర్బస్ సీఈఓ గుయిలౌమ్ ఫౌరీ అన్నారు. టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ మాట్లాడుతూ, “భారతదేశంలో మొట్టమొదటి హెలికాప్టర్ అసెంబ్లింగ్ సౌకర్యాన్ని ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేయడంపై టాటా గ్రూప్ సంతోషంగా ఉంది. భారతదేశంతోపాటు ఎగుమతి మార్కెట్ల కోసం ఎయిర్బస్ హెచ్125 సింగిల్ ఇంజన్ హెలికాప్టర్ సదుపాయంలోఎఫ్ఏఎల్ ఉంటుంది”అని ఆయన అన్నారు. హెచ్125 హెలికాప్టర్లను అత్యవసర వైద్య సేవలు, విపత్తు నిర్వహణ, పర్యాటకం వంటి సేవలకు వాడుకోవచ్చు.
300 లీప్-1బీ ఇంజిన్లకు ఆకాశ ఆర్డర్
తన150 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల కోసం 300 లీప్-1బీ ఇంజిన్లను కొనుగోలు చేసేందుకు ఆకాశ ఎయిర్.. ఫ్రాంకో- అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ తయారీదారు, సీఎఫ్ఎం ఇంటర్నేషనల్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ పర్యటన సందర్భంగా, ఆకాశ ఎయిర్, సీఎఫ్ఎం ఇంటర్నేషనల్ శుక్రవారం ఈ ఒప్పందాన్ని ప్రకటించాయి.
ఇందులో స్పేర్ ఇంజన్లు, సేవల ఒప్పందం కూడా ఉంది. అకాశ ఎయిర్ తన కార్యకలాపాలను 2022లో ప్రారంభించింది. గతంలో మొత్తం 76 లీప్-1బీ పవర్డ్ 737-–8 ఎయిర్క్రాఫ్ట్లను ఆర్డర్ చేసింది. -వీటిలో 22 ప్రస్తుతం సేవలు అందిస్తున్నాయి. కొత్త ఆర్డర్ భారతదేశంలో సీఎఫ్ఎం కార్యకలాపాలను పెంచుతుందని, 400 కంటే ఎక్కువ సీఎఫ్ఎం- శక్తితో పనిచేసే విమానాలను, 2,500 లీప్ ఇంజిన్లను డెలివరీ చేస్తామని సీఎఫ్ఎం తెలిపింది. జీఈ ఏరోస్పేస్, సఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్లు సీఎఫ్ఎం జేవీని ఏర్పాటు చేశాయి.