- రూ.17 వేల కోట్ల విలువైన బైబ్యాక్ ప్రకటన
- షేరుకు రూ.9 చొప్పున ఇంటెరిమ్ డివిడెండ్
న్యూఢిల్లీ: ఐటీ సర్వీసెస్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన రెండో క్వార్టర్లో రూ.11,342 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) సంపాదించింది. వార్షికంగా ఇది 8.7శాతం వృద్ధికి సమానం. గత ఏడాది రెండో క్వార్టర్లో కంపెనీ రూ.10,431 కోట్ల లాభాన్ని ప్రకటించింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.59,692 కోట్లకు చేరుకుంది. ఇది 2022 రెండో క్వార్టర్లో వచ్చిన రూ.55,309 కోట్లతో పోలిస్తే దాదాపు 8శాతం పెరిగింది.
మొత్తం ఆదాయం సంవత్సరానికి దాదాపు 8శాతం పెరిగి రూ.60,698 కోట్లకు చేరుకుంది. ఆపరేటింగ్ మార్జిన్ వార్షికంగా 0.3 శాతం పెరిగి 24.3శాతానికి చేరుకుంది. 2024 ఆర్థిక సంవత్సరం రెండవ క్వార్టర్లో టీసీఎస్ ఆర్డర్ బుక్ విలువ 11.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈసారి భారీ డీల్స్ చాలా సాధించామని టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ కృతివాసన్ అన్నారు. నిలకడమైన కరెన్సీ పరంగా, టీసీఎస్ రెండో క్వార్టర్ ఆదాయం వార్షికంగా 2.8శాతం పెరిగింది.
మాన్యుఫాక్చరింగ్ వర్టికల్5.8శాతం, లైఫ్ సైన్సెస్ హెల్త్కేర్ 5శాతం, యుటిలిటీలు 14.8శాతం, బీఎఫ్ఎస్ఐ -0.5శాతం, కమ్యూనికేషన్స్, మీడియా -2.1శాతం, కన్జూమర్ బిజినెస్ గ్రూప్ (సీబీజీ) 1 శాతం, టెక్నాలజీ, సేవల వర్టికల్ -2.2శాతం పెరిగాయి.
యూఎస్ నుంచి రెవెన్యూ 10 శాతం అప్
ప్రధాన మార్కెట్లలో రెవెన్యూ అంటే యునైటెడ్ స్టేట్స్ లో 10.7శాతం, యునైటెడ్ కింగ్డమ్ 1.3శాతం, ఉత్తర అమెరికా 0.1శాతం పెరిగాయి. భారతదేశ మార్కెట్ 3.9శాతం పెరిగింది. ఆసియా పసిఫిక్ 4.1శాతం విస్తరించింది. లాటిన్ అమెరికా 13.1శాతం లాభపడింది.
మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా 15.9శాతం వృద్ధి చెందాయి. ఇదిలా ఉంటే ఈక్విటీ షేరుకు రూ.9 చొప్పున రెండవ మధ్యంతర డివిడెండ్ను టీసీఎస్ డైరెక్టర్ల బోర్డు ప్రకటించింది. అంతేగాక ఒక్కో షేరుకు రూ.4,150 చొప్పున రూ.17 వేల కోట్ల వరకు షేర్ బైబ్యాక్ ప్రపోజల్ను కంపెనీ ఆమోదించింది.