న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్తో ముగిసిన క్వార్టర్లో టాటా మోటార్స్కు రూ.3,300.65 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) వచ్చింది. కిందటేడాది ఇదే క్వార్టర్లో రూ4,950.97 కోట్ల నష్టాన్ని కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. జాగ్వర్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) , కమర్షియల్ వెహికల్ సేల్స్ పెరగడంతో రిజల్ట్స్ మెరుగ్గా ఉన్నాయి. జూన్ క్వార్టర్లో కంపెనీ ఆపరేషనల్ రెవెన్యూ రూ. 1,01,528.49 కోట్లకు పెరగడం విశేషం. కిందటేడాది జూన్ క్వార్టర్లో టాటా మోటార్స్కు రూ.71,227.76 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఖర్చులు కూడా రూ.77,783.69 కోట్ల నుంచి రూ.98,266.93 కోట్లకు పెరిగాయి. స్టాండ్ఎలోన్ ప్రాతిపదికన టాటా మోటార్స్కు ఈ ఏడాది జూన్ క్వార్టర్లో రూ.64.04 కోట్ల నష్టం వచ్చింది. కిందటేడాది జూన్ క్వార్టర్లో రూ.181.03 కోట్ల నష్టాన్ని ప్రకటించింది.
కార్యకలాపాల నుంచి వచ్చే రెవెన్యూ రూ.14,793.12 కోట్ల నుంచి రూ.15,733.05 కోట్లకు పెరిగింది. జేఎల్ఆర్, కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో గ్రోత్ బాగుండడంతో క్యూ1 లో మెరుగైన పనితీరు కనబరిచామని టాటా మోటార్స్ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ నిలకడగా ఉందని వెల్లడించింది. అన్ని సెగ్మెంట్లలో మంచి పనితీరు కనబరిచామని, గతంలో అమలు చేసిన స్ట్రాటజీలు ఇప్పుడు ఫలితాన్ని చూపిస్తున్నాయని టాటా మోటార్స్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పీబీ బాలాజీ అన్నారు. రానున్న క్వార్టర్లలో కూడా ఇదే ముమెంటంను కొనసాగిస్తామని చెప్పారు. కాగా, టాటా మోటార్స్ సబ్సిడరీ జేఎల్ఆర్కు ఈ ఏడాది జూన్ క్వార్టర్లో 6.9 బిలియన్ పౌండ్ల (రూ.72,450 కోట్ల) ఆదాయం వచ్చింది. ట్యాక్స్లు కట్టకముందు వచ్చిన లాభం రూ.4,570 కోట్లుగా ఉంది.