- ఇంకో ఐదేళ్లలో సెన్సెక్స్ డబుల్
- అదే బాటలో నిఫ్టీ కూడా
- ప్రస్తుతం మార్కెట్ కరెక్ట్ అవ్వొచ్చు
- మోతీలాల్ ఓస్వాల్ సీనియర్ ఎనలిస్ట్ రామ్దేవ్ అగర్వాల్
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ కొత్త రికార్డ్లను క్రియేట్ చేస్తోంది. తాజాగా 67 వేల లెవెల్ను క్రాస్ చేసిన సెన్సెక్స్ ఇంకో ఐదేళ్లలో రెండింతలు పెరుగుతుందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్కు చెందిన సీనియర్ ఎనలిస్ట్ రామ్దేవ్ అగర్వాల్ అంచనావేశారు. నిఫ్టీ కూడా డబుల్ అవుతుందని పేర్కొన్నారు. అంటే ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి, ఐదేళ్ల పాటు వదిలేస్తే ఇన్వెస్టర్ల సంపద డబుల్ అవుతుందని చెప్పొచ్చు. ప్రస్తుత బెంచ్మార్క్ ఇండెక్స్లు తమ ఆల్టైమ్ గరిష్టాల దగ్గర ఉన్నాయని, మార్కెట్ కరెక్ట్ అవ్వొచ్చని ఓ టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. ‘ఇంకో ఐదేళ్ల వరకు నిఫ్టీ, సెన్సెక్స్లు కొత్త గరిష్టాలను తాకడం చూస్తాం. ప్రస్తుత లెవెల్స్ నుంచి డబుల్ అవుతుందని అనొచ్చు.
కానీ, షేర్లు కొనేముందు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతీది ఏ ధర దగ్గర దొరికితే ఆ ధర దగ్గర కొనలేము. షేర్లను కొనేముందు రీసెర్చ్ చేయాలి’ అని ఇన్వెస్టర్లకు ఆయన సలహా ఇచ్చారు. మార్కెట్ ర్యాలీ చేస్తుండడంలో విదేశీ ఇన్వెస్టర్లతో పాటు రిటైల్ ఇన్వెస్టర్ల పాత్ర కూడా ఉందని రామ్దేవ్ అగర్వాల్ పేర్కొన్నారు. ‘గతంలో అమ్మేసిన షేర్లను ఇప్పుడు ఎఫ్ఐఐలు మళ్లీ కొంటున్నారు. గ్లోబల్గా ఇతర దేశాలతో పోలిస్తే ఇండియా మంచి పొజిషన్లో ఉండడంతో తమ ఎక్స్పోజర్ను పెంచుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. కాగా, నిఫ్టీ గత 20 సెషన్లలోనే 19 వేల లెవెల్ నుంచి 19,980 లెవెల్ వరకు ర్యాలీ చేసింది. ఇండియన్ కంపెనీల రిజల్ట్స్ బాగానే ఉండడంతో పాటు వర్షాలు సరిగ్గా పడుతుండడంతో స్టాక్ మార్కెట్లు ర్యాలీ చేస్తున్నాయి.
కొత్త తరం టెక్ కంపెనీలకు గిరాకీ..
ట్రెడిషనల్ బిజినెస్లే కాకుండా జొమాటో, పేటీఎం వంటి కొత్త తరం టెక్ కంపెనీలు కూడా ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. ఈ కంపెనీల షేర్లు తమ కనిష్టాల నుంచి డబుల్ అవ్వడం చూశాం. కొత్త తరం కంపెనీల వాల్యుయేషన్ను పాత విధానాల్లో లెక్కించడం కష్టమని అగర్వాల్ పేర్కొన్నారు. హెచ్డీఎఫ్సీ మెర్జర్పై ఆయన మాట్లాడుతూ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గత 45 ఏళ్లలో భారీగా విస్తరించిందని అన్నారు. ఇంకో నాలుగేళ్లలో మరో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ను క్రియేట్ చేస్తామని బ్యాంక్ సీఈఓ చెప్పారని, ఇది వారికున్న నమ్మకానికి నిదర్శనమని అగర్వాల్ పేర్కొన్నారు. ఈ బ్యాంక్ షేరు ఫ్యూచర్లో మరింతగా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇతర బ్యాంకులు కూడా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ను మించి పెర్ఫార్మెన్స్ చేయొచ్చని వివరించారు.
మెరిసిన మెటల్ షేర్లు
బెంచ్మార్క్ ఇండెక్స్లు సెన్సెక్స్, నిఫ్టీ మంగళవారం ఫ్లాట్గా కదిలాయి. యూఎస్ ఫెడ్ పాలసీ కోసం ట్రేడర్లు వేచి చూస్తున్నారని ఎనలిస్టులు పేర్కొన్నారు. విదేశీ ఇన్వెస్ట్మెంట్లు (ఎఫ్ఐఐ) మార్కెట్ నుంచి వెళ్లిపోతుండడం, ఆయిల్ ధరలు పెరగడంతో మార్కెట్ పడుతోందని చెప్పారు. సెన్సెక్స్ మంగళవారం 29 పాయింట్లు (0.04 శాతం) నష్టపోయి 66,356 దగ్గర ముగిసింది. నిఫ్టీ 8 పాయింట్లు పెరిగి 19,681 వద్ద సెటిలయ్యింది. ఫెడ్ మీటింగ్ వివరాలు వెలువడే ముందు బెంచ్మార్క్ ఇండెక్స్లు ఫ్లాట్గా కదిలాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. రియల్టీ సెక్టార్కు సపోర్ట్గా ఉంటామని చైనా ప్రభుత్వం ప్రకటించడంతో మెటల్ షేర్లు మెరిశాయని చెప్పారు. డిమాండ్ పెరుగుతుందని, ఆపరేటింగ్ మార్జిన్ మెరుగవుతుందనే అంచనాల నేపథ్యంలో యుటిలిటీస్ షేర్లు పెరిగాయని పేర్కొన్నారు. బెంచ్మార్క్ ఇండెక్స్లు తమ ఆల్టైమ్ గరిష్టానికి చేరుకున్న తర్వాత వరుసగా రెండు సెషన్లలో పడిన విషయం తెలిసిందే.
కంపెనీల క్వార్టర్ల నెంబర్లు అంచనాల కంటే తక్కువగా ఉండడంతో మార్కెట్ పడుతోందని నాయర్ పేర్కొన్నారు. ఎఫ్ఐఐలు వెళ్లిపోతుండడం, డాలర్ బలపడుతుండడం కూడా మార్కెట్ పతనానికి కారణమని వివరించారు. మెటల్, ఆటో షేర్లు పెరిగాయని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా అన్నారు. ఇండెక్స్లు మరింతగా కన్సాలిడేటెడ్ అవుతాయని ఆయన అంచనావేశారు. సెన్సెక్స్లో జేఎస్డబ్లూ స్టీల్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు ఎక్కువగా పెరిగాయి. ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, ఎల్ అండ్ టీ, ఎస్బీఐ షేర్లు ఎక్కువగా పడ్డాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ మంగళవారం సెషన్లో 0.39 % పెరగగా, స్మాల్క్యాప్ ఇండెక్స్ 0.31 % ఎగిసింది. యుటిలిటీస్, మెటల్, పవర్, కమొడిటీ ఇండెక్స్లు ఎక్కువగా పెరిగాయి. క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, బ్యాంకెక్స్ ఇండెక్స్లు నష్టాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్లు మిశ్రమంగా కదిలాయి. డాలర్ మారకంలో రూపాయి 81.88 దగ్గర సెటిలయ్యింది.