‘ద కాశ్మీర్​ ఫైల్స్’కు పన్ను మినహాయింపు

‘ద కాశ్మీర్​ ఫైల్స్’కు పన్ను మినహాయింపు

అగర్తలా: 1990 నాటి కాశ్మీరీ పండిట్ల బతుకును తెలియజెప్పేలా తీసిన ద కాశ్మీర్​ ఫైల్స్​ సినిమాకు త్రిపుర ప్రభుత్వం పన్ను మినహాయింపు ప్రకటించింది. జనాలు ఈ సినిమాను చూసేలా ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. వివేక్​ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన కాశ్మీర్​ ఫైల్స్​ చిత్రాన్ని ప్రజలందరూ తప్పకుండా చూడాలని త్రిపుర సీఎం బిప్లవ్​ కుమార్ దేవ్ కోరారు. మరోవైపు కాశ్మీర్​ఫైల్స్​ చిత్రానికి పన్ను మినహాయింపు ఇస్తామని గోవా ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఇప్పటికే ఈ చిత్రానికి హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్నాటక పన్ను మినహాయింపు ప్రకటించాయి. కాగా, ఈ​ సినిమా చూసేందుకు పోలీసులు సెలవు పెట్టుకునే అవకాశం ఇస్తున్నట్టు మధ్యప్రదేశ్​ ప్రభుత్వం ప్రకటించింది.

ఎమ్మెల్యేల కోసం స్పెషల్​ షో
కాశ్మీరీ ఫైల్స్​ చిత్రాన్ని ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక షో వేయనున్నట్టు కర్నాటక అసెంబ్లీ స్పీకర్​ విశ్వేశ్వర హెగ్డే కగేరి సోమవారం వెల్లడించారు. కాగా, వారం పాటు రోజుకు ఒక షోకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని, జనం ఉచితంగా ఈ సినిమాను చూడాలని విజయపుర బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ ప్రకటించారు.