
- క్రికెట్దే పెద్ద వాటా
- ఐపీఎల్ సీజన్లో 34 కోట్ల మంది బెట్టింగ్ చేస్తున్నారు
- టీసీఎఫ్ రిపోర్టు వెల్లడి
న్యూఢిల్లీ : క్రికెట్ వరల్డ్కప్ జోరందుకోవడంతో ఇల్లీగల్ బెట్టింగ్ కూడా దేశంలో ఊపందుకుంది. రకరకాల మార్గాలలో కోట్లాది రూపాయలతో పందెం రాయుళ్లు బెట్టింగ్ చేస్తున్నారని, ఈ ఇల్లీగల్ బెట్టింగ్ కార్యకలాపాల వల్ల ప్రభుత్వానికి ఏటా రూ. 2 లక్షల కోట్ల పన్ను ఆదాయం పోతోందని ఒక రిపోర్టు వెల్లడించింది. ఇండియాలో ఏటా సాగుతున్న ఇల్లీగల్ స్పోర్ట్స్ బెట్టింగ్ కార్యకలాపాల విలువ రూ. 8,20,000 కోట్ల (100 బిలియన్ డాలర్లు) దాకా ఉంటుందని ఆ రిపోర్టు తెలిపింది. థింక్ ఛేంజ్ ఫోరమ్ (టీసీఎఫ్) పై రిపోర్టును రిలీజ్ చేసింది. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్, స్మార్ట్ఫోన్ల వాడకం, అథ్లెటిక్ ఈవెంట్స్ జోరుగా సాగడం వంటి వాటితో ఇల్లీగల్ బెట్టింగ్ ఊపందుకుంటోందని పేర్కొంది. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఇల్లీగల్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ దందాలు పెరుగుతూనే ఉన్నాయని టీసీఎఫ్ రిపోర్టు వెల్లడించింది. ఈ రిపోర్టు అంచనా ప్రకారం రూ. 8.20 లక్షల కోట్ల మొత్తం ఇల్లీగల్ బెట్టింగ్ కోసం డిపాజిట్ అవుతుంటే, దానిపై ఇప్పుడున్న జీఎస్టీ రేటు 28 శాతం ప్రకారం లెక్కిస్తే ప్రభుత్వం పన్నుల రూపంలో పోగొట్టుకుంటున్న ఆదాయం రూ. 2,29,600 కోట్లవుతుందని వివరించింది.
ఆపడం ఎలా....?
ఇల్లీగల్ బెట్టింగ్ కార్యకలాపాలకు చెక్ పెట్టాలంటే జీఎస్టీని కఠినంగా అమలు చేయాలని రిపోర్టు సూచిస్తోంది. మానిటరింగ్ కోసం ఒక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాలని, ఇల్లీగల్ ఆఫ్షోర్ బెట్టింగ్ కార్యకలాపాలను ఈ టాస్క్ఫోర్స్ దగ్గరగా పర్యవేక్షించాలని టీసీఎఫ్సలహా ఇచ్చింది. అప్పుడే, ఆఫ్షోర్ ఆపరేటర్లు కచ్చితంగా ఇండియాలో రిజిస్ట్రేషన్ చేసుకోవలసిన అవసరం ఏర్పడుతుందని పేర్కొంది. లేదంటే, దేశంలోని లీగల్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ నుంచి ఆఫ్షోర్ ప్లాట్ఫామ్స్కు అవుట్ఫ్లోను కాపాడుకోగలుగుతామని అభిప్రాయపడింది. ఇలాంటి కఠినమైన చర్యలు తీసుకోకపోతే, జీఎస్టీ రేటు పెంపు వల్ల ఇల్లీగల్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్కార్యకలాపాలు విచ్చలవిడిగా పెరగడానికి ఛాన్స్ ఉంటుందని పేర్కొంది.
ఫలితంగా పన్ను ఆదాయాన్ని ప్రభుత్వం నష్టపోవల్సి వస్తుందని వివరించింది. ఇండియాలో క్రికెటే డామినేట్ చేస్తోందని, ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) బెట్టింగ్ యాక్టివిటీ జోరును పెంచుతోందని వెల్లడించింది. ఇండియాలోని 14 కోట్ల మంది బెట్టింగ్, గ్యాంబ్లింగ్ కార్యకలాపాలలో రెగ్యులర్గా భాగం పంచుకుంటున్నారని, ఐపీఎల్ సీజన్లో ఈ సంఖ్య 37 కోట్ల దాకా పెరుగుతోందని టీసీఎఫ్ రిపోర్టు పేర్కొంది. దేశంలో బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ట్రాన్సాక్షన్లపై బ్యాన్ విధిస్తే, ఆఫ్షోర్ గ్యాంబ్లింగ్ కంపెనీలు ఇతర మార్గాలలో డబ్బును దేశం బయటకు తీసుకెళ్తాయని వివరించింది. హవాలా, క్రిప్టో కరెన్సీ, ఇతర అక్రమ మార్గాలలో డబ్బును ఇతర దేశాలకు తరలిస్తారని తెలిపింది.
75 బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సైట్లు..
టీసీఎఫ్ రిపోర్టు లెక్కల ప్రకారం బెట్టింగ్, గ్యాంబ్లింగ్ను ప్రోత్సహించే 75 వెబ్సైట్లు పనిచేస్తున్నాయి. ఈ వెబ్సైట్లన్నీ మన దేశంలోని ప్రజలనే టార్గెట్ చేసుకుంటున్నాయి. లీగల్గా కొన్నింటి ఆపరేషన్స్పై బ్యాన్ పెట్టినా, ఏదోలా అవి తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని టీసీఎఫ్ రిపోర్టు చెబుతోంది. పాపులర్ బాలీవుడ్ యాక్టర్లు, స్పోర్ట్స్ పర్సనాలిటీలను వాడుకుని మరీ దేశంలోని యూజర్లకు దగ్గరయ్యే ప్రయత్నాలను ఆ ఆపరేటర్లు చేస్తున్నారని వివరించింది. సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్స్ (ఎస్ఆర్ఓ)ల ఏర్పాటులో ఆలస్యం జరిగితే ఆఫ్షోర్ బెట్టింగ్ సైట్లు మరిన్ని పెరుగుతాయని రిపోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఎస్ఆర్ఓలు లేకపోతో ఎవరు లీగల్ ఆపరేటర్, ఎవరు ఇల్లీగల్ ఆపరేటర్ అనేది తేల్చడం కష్టసాధ్యంగా మారి, రెగ్యులేటర్లు చర్యలు తీసుకోలేరని వెల్లడించింది.