న్యూఢిల్లీ: లాక్డౌన్ వల్ల మిగతా కంపెనీల ఉద్యోగులు కష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ, ఐటీ సర్వీసుల కంపెనీ టీసీఎస్ మాత్రం తన కంపెనీలో పనిచేసే వారికి తీపి కబురు అందించింది. ఇక నుంచి 2.60 లక్షల మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వనుంది. 20 ఏళ్ల నాటి ఆపరేటింగ్ మోడల్ను పూర్తిగా మార్చి ఆఫీసులను తక్కువ స్టాఫ్తో నడపాలని నిర్ణయించింది. ప్రస్తుతం టీసీఎస్కు 3.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం వీరిలో ఇప్పుడు 20 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేస్తుండగా, 2025 నాటికి వీరి సంఖ్యను 75 శాతానికి పెంచాలని టీసీఎస్ కోరుకుంటున్నది. అంటే 2.62 లక్షల మంది ఇంటి నుంచే పనిచేస్తారు. ఆఫీసులకు 25 శాతానికి మించి ఉద్యోగులు రావాల్సిన అవసరం లేదని, మిగిలిన వాళ్లంతా ఇంటి నుంచే పనిచేయవచ్చని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుబ్రమణియం అన్నారు.
ఎస్బీడబ్ల్యూఎస్ విధానం సక్సెస్
లాక్డౌన్ తరువాత ఈ కంపెనీ తన మొత్తం ఉద్యోగులతో సెక్యూర్ బోర్డర్లెస్ వర్క్ స్పేస్ (ఎస్బీడబ్ల్యూఎస్) విధానంలో పనిచేయించింది. దీనివల్ల మంచి ఫలితాలు వచ్చాయి. ఈ విధానంలో ఇప్పటికే 35 వేల మీటింగ్స్ నిర్వహించారు. 40,600 కాల్స్, 340 లక్షల మెసేజ్లు వెళ్లాయని సీఈఓ, ఎండీ రాజేశ్ గోపీనాథన్ చెప్పారు. అందుకే ఇక నుంచి 75 శాతం మంది ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేయించాలని కంపెనీ నిర్ణయించింది. ఇండియాలో టీసీఎసే అతిపెద్ద ఐటీ కంపెనీ కాబట్టి మిగతా ఐటీ కంపెనీలు కూడా ఇదే బాట పట్టే అవకాశాలు ఉన్నాయి. విపరీతమైన ట్రాఫిక్ ఉండే మెట్రో నగరాల్లో పనిచేసే ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని రవి గజేంద్రన్ అనే ప్రొఫెసర్ అన్నారు. టీసీఎస్ విధానాన్ని ఇన్ఫోసిస్, విప్రో వంటివి అనుసరించే అవకాశాలు ఉన్నాయని వివరించారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి మారినప్పటికీ తమ ప్రాజెక్టులన్నీ యథావిధిగా కొనసాగుతున్నాయని, ఎలాంటి సమస్యలూ లేవని సుబ్రమణియం వివరించారు. ఈ విషయమై అనరాక్ కన్సల్టింగ్కు చెందిన ఆశుతోష్ లిమయే మాట్లాడుతూ ఎంట్రీ, మిడిల్ లెవెల్ ఉద్యోగుల ఇండ్లలో ప్రత్యేకంగా స్టడీ రూమ్స్, హార్డ్వేర్ వంటి ఎక్విప్మెంట్లు ఉండకపోవచ్చని అన్నారు. నెట్వర్క్ సమస్యలు కూడా రావొచ్చని అన్నారు. మనదేశంలో ఐటీ ఇన్ఫ్రా బాగానే పెరిగిందని, ఇది మరింత డెవెలప్కావాల్సి ఉందని చెప్పారు.