ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అక్టోబర్ 4న విచారణకు రావాలని పిలుపు
న్యూఢిల్లీ, వెలుగు: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ నేషనల్ జనరల్ సెక్రటరీ నారా లోకేశ్కు ఏపీ సీఐడీ అధికారులు శనివారం నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ఏ14 గా ఉన్న లోకేశ్కు 41ఏ కింద నోటీసులు అందజేశారు. అక్టోబర్ 4న విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలోని అశోక రోడ్లో ఉన్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో లోకేశ్ ను అధికారులు కలిసి నోటీసులిచ్చారు.
ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం లోకేశ్ హైకోర్టును ఆశ్రయించారు. 41ఏ కింద నోటీసులు ఇవ్వడమంటే అరెస్టు కాదని అధికారులు కోర్టుకు తెలపడంతో పిటిషన్ను హైకోర్టు క్లోజ్ చేసింది.
సీఐడీ లవ్ లెటర్ అందింది: లోకేశ్
ఏపీ సీఐడీ అధికారులు వచ్చి లవ్ లెటర్ ఇచ్చారని లోకేశ్ అన్నారు. అక్టోబర్ 4న సీఐడీ ముందు హాజరవుతానన్నారు. శనివారం సీఐడీ నోటీసులిచ్చాక ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ జేబు సంస్థలా ఏపీ సీఐడీ పనిచేస్తోందని ఆరోపించారు. సీఎం జగన్, ఎంపీ సాయిరెడ్డి మాదిరి వాయిదాలు తీసుకోనని, ఎక్కడికీ పారిపోనని చెప్పారు. సంబంధం లేని కేసులో తనను ఇరికిస్తున్నారని ఫైరయ్యారు.