
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 2 నుంచి 11 వరకు పదిరోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యేలా అధికారులు షెడ్యూల్ రూపొందించారు. ఎలాంటి కోర్టు కేసులు అడ్డురాకుంటే ఈ ప్రక్రియ షెడ్యూల్ ప్రకారమే పూర్తి చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సారి 3,867 మంది టీచర్లకు ప్రమోషన్లు రానున్నాయి.
వీరిలో 902 మంది స్కూల్ అసిస్టెంట్లకు హెచ్ఎంలుగా, 2,965 మంది ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్, పీఎస్ హెచ్ఎంలుగా ప్రమోషన్లు పొందనున్నారు. కాగా, కొందరు బదిలీలు నిర్వహించిన తర్వాతే ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు మంగళవారానికి వాయిదా పడింది.
సర్కారు నిబంధనల ప్రకారం బదిలీలకు రెండేండ్ల సర్వీస్ పూర్తికావాల్సి ఉందని.. కానీ, హెచ్ఎంలకు బదిలీలు నిర్వహించి రెండేండ్లు పూర్తికాలేదని అధికారులు చెప్తున్నారు. ప్రమోషన్ల ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందనే ఆశతో ఉన్నామని పేర్కొంటున్నారు. కాగా, మంగళవారం హైకోర్టులో హియరింగ్ పూర్తయిన తర్వాతే వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభించనున్నారు.
ప్రమోషన్ల షెడ్యూల్ ఇలా..
ఈ నెల 2న ఆన్లైన్లో హెచ్ఎం, స్కూల్ ఇసిస్టెంట్ ప్రస్తుత ఖాళీల లిస్టు, ఎస్ఏ, ఎస్జీటీల తాత్కాలిక సీనియార్టీ లిస్టు విడుదల చేస్తారు. 3న సీనియారిటీ జాబితాలపై అభ్యంతరాల సమర్పణ, 4 ,5 తేదీల్లో అభ్యంతరాల పరిష్కారం, స్కూల్ అసిస్టెంట్ల ఫైనల్ సీనియర్టీ లిస్టు రిలీజ్, 6 న జీహెచ్ఎం ప్రమోషన్ల కోసం స్కూల్ అసిస్టెంట్ల వెబ్ ఆప్షన్లు, అందుబాటులో ఎడిట్ ఆప్షన్లు, 7న జీహెచ్ఎం ప్రమోషన్ల ఉత్తర్వులు జారీ, 8,9తేదీల్లో ఎస్జీటీల ఫైనల్ సీనియార్టీ లిస్టు, స్కూల్ అసిస్టెంట్, పీఎస్ హెచ్ఎం ఖాళీల లిస్టు రిలీజ్, 10 న ఎస్ఏ ప్రమోషన్ కోసం ఎస్జీటీల వెబ్ ఆప్షన్లు, 11న జిల్లా కలెక్టర్ ఆమోదంతో ఎస్ఏ , పీఎస్ హెచ్ఎం ప్రమోషన్ల ఆర్డర్లు ఇవ్వనున్నారు.