
హైదరాబాద్, వెలుగు: పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దుతో పాటు పలు సమస్యల పరిష్కారానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఉద్యమానికి రెడీ అవుతున్నారు. సర్కారుకు పలుమార్లు వినతులు ఇచ్చినా పట్టించుకోక పోవ డంతో ఈనెల13న చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. దీనికోసం సోమవారం ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలని, ఈ నెల 3వ, 4వ తేదీల్లో జిల్లాల్లో జేఏసీ సమావేశాలు నిర్వహించాలని జేఏసీ నేతలు నిర్ణయించారు.
ఈనెల 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జిల్లా కేంద్రాల్లో సన్నాహక సదస్సులు, మార్చి 10వ,11వ తేదీల్లో మండలాలు, డివిజన్లలో ముమ్మర ప్రచారం నిర్వహించాలని నేతలకు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్లోని బీసీ సాధికారతభవన్లో రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లు, పబ్లిక్ సెక్టార్ అండ్ కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో సుమారు 35 సంఘాల నేతలు పాల్గొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు, ప్రభుత్వ హామీలపై చర్చించారు. జేఏసీ నేతలు మాట్లాడుతూ… స్టేట్లో మూడున్నర లక్షల మంది ఉద్యోగులు, రెండున్నర లక్షల మంది పింఛనర్లు, లక్షమంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవడంతో కీలకంగా పనిచేస్తున్న ఉద్యోగులు, గౌరవప్రదంగా జీవించేందుకు అవకాశం కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. కొత్త పీఆర్సీ2018 జులై 1 నుంచి అమలు కావాలి, కానీ ఇప్పటికీ అమలు చేయడం లేదన్నారు. 2018 మే 16న ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాలతో సీఎం కేసీఆర్ సమావేశమై, అదే ఏడాది జులై 2వ తేదీ నుంచి ఐఆర్ ఇస్తాననీ, 2018 ఆగస్టు 15 నాటికి తొలి పీఆర్సీ ఇస్తామని చెప్పినట్టు గుర్తుచేశారు. పీఆర్సీ గడువు 3 నెలల నుంచి 30 నెలలకు పొడగించారన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కేంద్ర ఏడో వేతన సంఘం సిఫారసులు అమలు చేస్తున్న అన్ని రాష్ట్రాల్లో, తెలంగాణ కంటే ఎక్కువ జీతాలున్నాయని తెలిపారు. కానీ దేశంలో తెలంగాణ ఉద్యోగులకే జీతాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనీ, సీఎం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్టీయూ స్టేట్ ప్రెసిడెంట్ సదానందంగౌడ్, యూటీఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ జంగయ్య, చావ రవి, మైస శ్రీనివాస్, లింగారెడ్డి, లక్ష్మణ్ నాయక్, కృష్ణుడు, కొండయ్య, యాదగిరి, రామారావు, సంపత్ కుమార్, మోత్కూరి నరహరి, సుధాకర్రావు, పర్వతరెడ్డి, పోచయ్య, రాధాకృష్ణ, కృష్ణమూర్తి, రాజేంద్రబాబు, నర్సింగరావు, రమేశ్, ఇర్ఫానుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.