వైజాగ్ లో గూగుల్ భారీ పెట్టుబడి.. ఏఐ హబ్ కోసం 1.33 లక్షల కోట్లు

వైజాగ్ లో గూగుల్ భారీ పెట్టుబడి..  ఏఐ హబ్  కోసం 1.33 లక్షల కోట్లు
  •  ఇక్కడే డేటా సెంటర్​
  • గిగావాట్ ​కెపాసిటీతో నిర్మాణం  
  • 30 వేల మందికి ఉపాధి2028లో మొదలయ్యే చాన్స్​

న్యూఢిల్లీ:టెక్ కంపెనీ గూగుల్ భారతదేశంలో అతిపెద్ద పెట్టుబడిని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్​లో ఏఐ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ హబ్ ఏర్పాటు కోసం 15 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.33 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు మంగళవారం తెలిపింది. ఇందులో భాగంగా అదానీ గ్రూప్ భాగస్వామ్యంతో గిగావాట్ కెపాసిటీ గల డేటా సెంటర్​ను నిర్మించనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో గూగుల్​ ఢిల్లీలో మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది. 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వనీ వైష్ణవ్​​ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న ఈ ఏఐ హబ్, అమెరికా వెలుపల గూగుల్​కు అతిపెద్దది. ఇందులో రెన్యువబుల్​ఎనర్జీతో నడిచే  డేటా సెంటర్​, ఫైబర్- ఆప్టిక్ నెట్‌‌‌‌వర్క్ ఉంటాయి.   మొత్తం  30 వేల మందికి ఉపాధి లభిస్తుంది. 

2028 నాటికి ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2028-–32 మధ్య రాష్ట్ర స్థూల ఉత్పత్తికి ఏటా రూ.10,518 కోట్లు సమకూరుతుంది.  ఈ సందర్భంగా  గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ మాట్లాడుతూ, రాబోయే ఐదేళ్లలోపు15 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్​ చేస్తామని ప్రకటించారు. భారతదేశంలో ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, గూగుల్​లాగే ఇతర అమెరికన్ టెక్ కంపెనీలు కూడా పెట్టుబడులను పెంచుతున్నాయి.  అమెజాన్ 2030 నాటికి క్లౌడ్ మౌలిక సదుపాయాలలో 12.7 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. 

చాట్​జీపీటీ  గిగావాట్ డాటా సెంటర్​ను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. మైక్రోసాఫ్ట్ భారతదేశంలో డేటా సెంటర్లను విస్తరిస్తోంది.  గౌతమ్ అదానీ, ముకేశ్ అంబానీ కూడా డేటా సెంటర్​ సామర్థ్యాన్ని పెంచడానికి పెట్టుబడులు ప్రకటించారు.  

ఎయిర్​టెల్ భాగస్వామ్యం

ఈ ప్రాజెక్ట్​ కోసం టెలికం ఆపరేటర్​ ఎయిర్​టెల్ బలమైన ఇంట్రా-సిటీ, ఇంటర్-సిటీ ఫైబర్ నెట్‌‌‌‌వర్క్​ను  నిర్మిస్తామని ప్రకటించింది. ఈ అధిక-సామర్థ్యం, లోలేటెన్సీ నెట్‌‌‌‌వర్క్ వల్ల గూగుల్ వినియోగదారులకు మేలు జరుగుతుందని పేర్కొంది.  ఇది దేశవ్యాప్తంగా డిజిటల్ ఇన్​క్లూజివిటీని పెంచుతుందని  భారతీ ఎయిర్​టెల్ వైస్ చైర్మన్ ఎండీ గోపాల్ విఠల్ చెప్పారు. విశాఖపట్నం గ్లోబల్ ఏఐ హబ్‌‌‌‌గా మారుతోందని తెలిపారు.  

సబ్​సబీ కేబుల్స్​ను నెట్​వర్క్​కు లింక్ చేయడానికి కేబుల్​ ల్యాండింగ్​ స్టేషన్​నూ నిర్మిస్తామని వెల్లడించారు. ఇదిలా ఉంటే,  గౌతమ్ అదానీకి చెందిన అదానీ కానెక్స్ కూడా ఈ ప్రాజెక్ట్​కు అవసరమైన బిల్డింగ్​ వంటి మౌలిక సదుపాయాలను నిర్మిస్తుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా కొత్త అంతర్జాతీయ సబ్‌‌‌‌సీ గేట్‌‌‌‌వే నిర్మాణాన్ని కూడా చేపడతారు.  

గూగుల్ ప్రకటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 'ఎక్స్'లో స్పందించారు. ఈ భారీ పెట్టుబడి వికసిత్ భారత్ నిర్మాణ దృష్టికి అనుగుణంగా ఉందని తెలిపారు. ఇది టెక్నాలజీ ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో శక్తివంతమైన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.