
గజ్వేల్, వెలుగు: తన ఆస్తులను ప్రభుత్వానికి రాసిచ్చి జూన్2 నుంచి ప్రజా పాదయాత్ర ప్రారంభిస్తానని తీన్మార్ మల్లన్న ప్రకటించారు. ప్రజా సేవ చేయాలనుకునే వారు తమ ఆస్తులన్నీ ప్రభుత్వానికి అప్పగించి రాజకీయాల్లోకి రావాలని సూచించారు. రాష్ట్రంలో రాజకీయ పాదయాత్రలు జరుగుతున్నాయని, తాను మాత్రం ప్రజలను చైతన్యం చేయటానికే పాదయాత్ర చేయనున్నట్టు చెప్పారు. ఇకపై కేసీఆర్ను తాను ఒక్కమాట కూడా అననని, రాజకీయాలు చేయనని, ప్రజల్ని చైతన్యం చేసే లక్ష్యంతో పని చేస్తానని తెలిపారు. గురువారం గజ్వేల్లో ఆయన 7,200 సమావేశం నిర్వహించారు. అన్ని హంగులతో గజ్వేల్లో 100 పడకల హస్పిటల్ కట్టినట్టు చెప్తున్న కేసీఆర్.. తన పంటి నొప్పి చికిత్స కోసం స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఢిల్లీకి ఎందుకు పోతున్నాడని మల్లన్న ప్రశ్నించారు. పేదల పిల్లలు సర్కారు బడుల్లో చదువుతుంటే సీఎం మనవడు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడని, అందరి పిల్లలూ సర్కారు బడుల్లోనే చదువుకునేలా వాటిని తీర్చిదిద్దడానికే 7,200 ఉద్యమమని చెప్పారు. సమావేశం తర్వాత కేసీఆర్ ఫాంహౌస్వైపు వెళ్లేందుకు మల్లన్న ప్రయత్నించారు. అయితే పాములపర్తి చౌరస్తాలో పోలీసులు అడ్డుకున్నారు. తాను కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ను చూడటానికి వెళుతున్నానని చెప్పినా వినలేదు.మల్లన్నను పోలీసు వాహనంలో ఎక్కించి ఔటర్ రింగ్ రోడ్డు వరకు తీసుకొచ్చి వదిలేశారు.