- రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కృషిచేస్తానన్న ఆర్జేడీ నేత
- 20 నెలల్లోనే ఇంటికో జాబ్
- మహిళలకు ఒకే విడతలో రూ.30 వేలు అందజేస్తం
- బిహార్ను అభివృద్ధి నితీశ్ వల్ల కాదని విమర్శ
ఖగారియా(బిహార్): రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఫ్యాక్టరీలను నెలకొల్పుతానని, దేశంలోనే బిహార్ను అగ్రగామి రాష్ట్రంగా నిలుపుతానని ఇండియా బ్లాక్ సీఎం క్యాండిడేట్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం మాత్రమే తాము ఈ ఎన్నికల్లో పోరాడడంలేదని, అధికారంలోకి వస్తే రాష్ట్ర పునర్నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పారు.
శనివారం ఖగారియా జిల్లాలోని గోగ్రిలో ఆర్జేడీ పార్బట్ట క్యాండిడేట్సంజీవ్కుమార్కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో తేజస్వీ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మనం బిహార్ను అభివృద్ధిలో నంబర్వన్గా మార్చాలి. ఇందుకోసం ఇన్వెస్ట్మెంట్స్తేవడం, విద్యకు ప్రోత్సాహం, సరైన ఆరోగ్య సౌకర్యాలను కల్పించడం అవసరం” అని పేర్కొన్నారు. బిహార్లో భూమి కొరత ఉన్నందున ఇక్కడ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయలేమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే పెట్టుబడులు సాధించి ఫ్యాక్టరీలు నెలకొల్పి చూపుతామన్నారు.
బిహార్ను నితీశ్ నడిపించలేరు
సీఎం నితీశ్ కుమార్ను ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైజాక్ చేశారని, ఇక ఆయన రాష్ట్రాన్ని నడిపించలేరని తేజస్వీ యాదవ్ ఎద్దేవా చేశారు. ఖగారియా జిల్లాలోని అలౌలి నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్థి రామవృక్ష సదా తరఫున తేజస్వీ ప్రచారం చేశారు. ర్యాలీలో ప్రసంగించారు.
‘‘జులై నుంచి డిసెంబర్ వరకు వరదల కారణంగా ఈ ప్రాంతం మునిగిపోయింది. రైతులు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. కానీ సీఎంతోసహా ఎవరూ ఇక్కడికి రాలేదు” అని మండిపడ్డారు. ఈ ప్రాంతంలో డ్రైనేజీ సౌకర్యాలను కల్పించి వర్షాకాలంలో నీరు నిల్వకుండా శాశ్వత పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 21 ఏండ్లుగా.. కేంద్రంలో 11 ఏండ్లుగా ఎన్డీయే సర్కారు అధికారంలో ఉన్నా అలౌలీలో కనీసం ఒక్క డిగ్రీ కాలేజీ కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు.
తనకు అవకాశం ఇస్తే ఏ విద్యార్థి బయటకు వెళ్లి చదువుకోవాల్సిన అవసరం లేకుండా.. స్థానికంగా స్కూళ్లు, కాలేజీలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేలా 20 రోజుల్లోపు చట్టం రూపొందించి 20 నెలల్లో నియామకాలు పూర్తి చేస్తామని తెలిపారు. మహిళలకు ఒకే విడతలో రూ.30 వేలు మొత్తాన్ని ఇవ్వడంతోపాటు కాంట్రాక్టు కార్మికులు, కమ్యూనిటీ మొబిలైజర్ల సేవలను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు.
మా క్యాండిడేట్ను చూసి బీజేపీకి వణుకు
ఈబీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ఇండియా బ్లాక్ డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ప్రకటించడంతో బీజేపీ భయపడుతోందని తేజస్వీ యాదవ్ అన్నారు. పాట్నాలో తేజస్వీ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈబీసీ సమాజంపై బీజేపీకి ఉన్న ద్వేషం బయటపడింది. మా డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ముఖేశ్ సహానీని నామినేట్ చేయడాన్ని వారు పదే పదే ప్రశ్నిస్తున్నారు. బిహార్ డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ఈబీసీ నేతను నామినేట్ చేస్తే అమిత్ షా ఎందుకంత నిరాశ చెందారు?” అని ప్రశ్నించారు.
ముస్లిం మైనార్టీలను చొరబాటుదారులుగా పేర్కొంటున్న బీజేపీ.. ఇప్పుడు ఇండియా బ్లాక్ ఎందుకు వారిని డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ప్రకటించడంలేదని ప్రశ్నిస్తోందని మండిపడ్డారు. మైనార్టీలను పాకిస్తాన్ పంపిస్తామని బెదిరించే ఆ పార్టీ.. వారి ప్రాతినిథ్యం గురించి ఎందుకు ఆందోళన చెందుతోందని నిలదీశారు. తాము త్వరలోనే బీజేపీ నేతల ఆందోళనను తీరుస్తామని చురకలంటించారు. ప్రధాని నరేంద్ర మోదీ తన రాష్ట్రం గుజరాత్కు చేసినదాంట్లో ఒక శాతంకూడా
బిహార్కు చేయలేదని ఆరోపించారు.
