హైదరాబాద్, వెలుగు: తెలంగాణలోని మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకుల సొసైటీకి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. 2025 –26 బడ్జెట్లో రూ.1871 కోట్లు కేటాయించగా, వచ్చే 2026–27 ఆర్ధిక సంవత్సరానికి రూ.3010 కోట్లకు పెంచింది. గత ఏడాది బడ్జెట్లో రూ.1370 కోట్లు విడుదల చేసినట్లు బీసీ గురుకుల సెక్రటరీ సైదులు తెలిపారు.
ఆ నిధులతో గురుకుల పాఠశాలలు, హాస్టళ్ల మరమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయని, జూన్ చివరి నాటికి పూర్తవుతాయని చెప్పారు. తాజా బడ్జెట్లో ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు, డైట్ ఛార్జీలకు రూ.358 కోట్లు, హాస్టళ్లు, భవనాల నిర్మాణం, మరమ్మతులకు రూ.500 కోట్లు, కిచెన్ల మరమ్మతులకు రూ.25 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
బీసీ సొసైటీ పరిధిలో సుమారు 300 పాఠశాలలు, కాలేజీలు ఉండగా, దాదాపు లక్షా 40 వేల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. నిధుల కేటాయింపుపై తమ వినతులను పరిగణనలోకి తీసుకున్నందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు సెక్రటరీ కృతజ్ఞతలు తెలిపారు.
