హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్లో చేరాలని రాష్ట్రానికి కేంద్రం సూచించింది. భవిష్యత్లో ఇదే పెద్ద స్కీమ్ అవుతుందని, ఇందులో చేరితే ఆయకట్టుకు అదనపు ప్రయోజనాలు కలుగుతాయని వివరించింది. హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీలో గురువారం కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల ఇరిగేషన్ సదస్సులో.. జలశక్తి శాఖ కార్యదర్శి ఈ మేరకు సూచనలు చేశారు.
ఈ కాన్ఫరెన్స్లో తెలంగాణతో పాటు ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ రాష్ట్రాల ఇరిగేషన్ సెక్రటరీలు, అధికారులు పాల్గొన్నారు. కాన్ఫరెన్స్లో తెలంగాణకు సంబంధించి సెక్రటరీ శ్రీధర్... ఏఐబీపీ, డ్రిప్కు సంబంధించిన ప్రాజెక్టులపై ప్రెజంటేషన్ ఇచ్చారు. అయితే కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత స్కీమ్లను ఏవైనా రాష్ట్రాలు మూడేండ్ల పాటు వాడుకోకుంటే.. వాటిని కేంద్ర ప్రభుత్వ స్కీమ్ల నుంచి తొలగిస్తామని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి తేల్చిచెప్పారు. అయితే, దేవాదుల, పాలెం వాగులను 2026–30 నాటికి పూర్తి చేసేందుకు గడువును పొడిగించాలని అధికారులు కేంద్రాన్ని కోరారు.
