హంగ్ వస్తుందా.?.. తెలంగాణలో మొదలైన చర్చ

హంగ్ వస్తుందా.?.. తెలంగాణలో  మొదలైన చర్చ
  • హంగ్​ వస్తుందన్న బీజేపీ  సీనియర్​ నేత బీఎల్​ సంతోష్
  • తామే కీలకంగా మారుతామని కామెంట్​
  • గ్యారంటీలు తమనే గెలిపిస్తాయంటున్న కాంగ్రెస్​
  • హ్యాట్రిక్​ కొడ్తామంటున్న బీఆర్​ఎస్​

హైదరాబాద్​, వెలుగు:  రాష్ట్రంలో హంగ్​పై చర్చ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా మెజార్టీ రాకపోవచ్చన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ప్రధాన పార్టీల లీడర్లు కూడా హంగ్​ దిశగా ఫలితాలు ఉంటాయని అంచనాలు వేసుకుంటున్నారు. వివిధ ఏజెన్సీలు నిర్వహిస్తున్న ఎన్నికల సర్వేల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ అంచనాలన్నీ.. పొలిటికల్​ సర్కిల్స్​లో ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న బీఆర్​ఎస్.. ఇప్పుడు మూడో ఎన్నికను ఎదుర్కొంటున్నది. హ్యాట్రిక్​ సాధిస్తామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

అయితే.. బీఆర్​ఎస్​ తొమ్మిదిన్నరేండ్ల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని, మార్పును కోరుకుంటున్నారని ప్రతిపక్ష పార్టీలు బలంగా నమ్ముతున్నాయి. గతంతో పోలిస్తే కర్నాటక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్​ పుంజుకోవటం, మూడేండ్లుగా రాష్ట్రంపై  బీజేపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో ఈసారి పొలిటికల్​ సీన్​ మారిపోయింది. అధికార బీఆర్​ఎస్​కు ప్రతిపక్షాల నుంచి టైట్​ ఫైట్​ ఉంటుందన్న అభిప్రాయాలు అందరినోటావినిపిస్తున్నాయి.

ఎవరి సర్వేలు వాళ్లకు అనుకూలమే.. కానీ..!

రాష్ట్రంలో అసెంబ్లీలో 119 ఎమ్మెల్యే స్థానాలున్నాయి. ఏదైనా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 60 ఎమ్మెల్యే సీట్లు (మేజిక్​ ఫిగర్​) ఉండాలి. ఏ పార్టీకి మేజిక్​ ఫిగర్​ దక్కకపోతే.. హంగ్  ఏర్పడుతుంది. అప్పుడు ఇతరుల మద్దతుతో మేజిక్​ ఫిగర్​ సాధించేందుకు పార్టీలు పోటీ పడుతాయి. ఈసారి రాష్ట్రంలో అటువంటి పరిస్థితే ఎదురవుతుందని జాతీయ, స్థానిక సర్వే ఏజెన్సీలన్నీ  తమ అంచనాల్లో పేర్కొంటున్నాయి. 

అయితే.. పార్టీ అఫిలియేటెడ్​గా సర్వేలు చేస్తున్న ఏజెన్సీలన్నీ ఎవరికివారే అధికారంలోకి వస్తారన్నట్లుగా తమ రిపోర్టులను  పబ్లిక్​లోకి వదులుతున్నారు. పార్టీలకు సంబంధం లేకుండా చేస్తున్న సర్వేల్లో పోటా పోటీ ఉంటుందన్న రిజల్ట్స్​ వస్తున్నాయి. మూడు నుంచి ఐదు శాతం ఓట్ల తేడా మాత్రమే ఉందని పలు ఏజెన్సీలు నివేదిస్తున్నాయి. కొన్ని ఏజెన్సీలు బీఆర్ఎస్​ సింగిల్​ లార్జెస్ట్​ పార్టీగా అవతరిస్తుందని చెప్తుండగా.. ఇంకొన్ని ఏజెన్సీలు కాంగ్రెస్​కు ఎక్కువ సీట్లు వస్తాయని నివేదిస్తున్నాయి. హంగ్​ ఏర్పడుతుందని పలు సంస్థల రిపోర్టులు చెప్తున్నాయి.

 ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ కీలకం కాబోతుందని ఆ పార్టీలోని అత్యంత కీలక నేత బీఎల్​ సంతోష్​ చేసిన కామెంట్స్​ ఉత్కంఠకు దారితీశాయి. సెంట్రల్​ ఇంటెలిజెన్స్​తో పాటు పలు సర్వే సంస్థల నివేదికలను చూసిన తర్వాతే ఆయన ఈ కామెంట్స్​ చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

మొదటిసారి బొటాబొటీ... రెండోసారి  విక్టరీ

2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​ 63 సీట్లలో గెలిచి అధికార పీఠాన్ని దక్కించుకున్నది. కాంగ్రెస్​ పార్టీ నుంచి 21 మంది, టీడీపీ నుంచి 15 మంది, ఎంఐఎం నుంచి ఏడుగురు, బీజేపీ నుంచి ఐదుగురు, వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ నుంచి ముగ్గురు, బీఎస్పీ నుంచి ఇద్దరు, సీపీఐ, సీపీఎం నుంచి ఒక్కొక్కరు విజయం సాధించారు. ఒక ఇండిపెండెంట్​ గెలిచారు. అసెంబ్లీ కాల పరిమితి ఇంకో ఏడు నెలలు ఉండగానే కేసీఆర్​ 2018  సెప్టెంబర్​ లో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. డిసెంబర్​ లో జరిగిన ఎన్నికల్లో 88 సీట్లతో బీఆర్​ఎస్​ భారీ విజయం నమోదు చేసుకుంది. 

కాంగ్రెస్​ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఎంఐఎం ఏడు సిట్టింగ్​ సీట్లను నిలబెట్టుకోగా టీడీపీ రెండు సీట్లకు, బీజేపీ ఒక స్థానానికి పడిపోయాయి. ఫార్వర్డ్​ బ్లాక్​ నుంచి ఒకరు, ఇండిపెండెంట్​ గా ఒకరు విజయం సాధించారు. ఈసారి డిసెంబర్​ మొదటి వారంలోనే  ఎన్నికలు జరుగుతాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. అప్పటి వరకు తాము మరింత బలం పుంజుకుంటామని కాంగ్రెస్​, బీజేపీ ఆశలు పెట్టుకోగా.. కేసీఆర్​ ప్రచారం మొదలు పెట్టగానే ఇప్పుడు కనిపిస్తున్న వ్యతిరేకత తగ్గిపోతుందని బీఆర్ఎస్​ లెక్కలు వేసుకుంటున్నది. 

మూడు పార్టీల్లో ఇట్ల..!

కేసీఆర్​ ప్రభుత్వం గడిచిన తొమ్మిదిన్నరేండ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉంది. ప్రభుత్వంపై ప్రజల్లో క్రమంగా వ్యతిరేకత పెరుగుతున్నట్టు పలు జాతీయ, ప్రాంతీయ  సర్వే ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. బీఆర్ఎస్​ ఎక్కువ మంది సిట్టింగ్​లకే టికెట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే.. వాళ్లపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతున్నదని, ఇదే అధికార పార్టీకి ప్రతికూల ఫలితాలు తెచ్చిపెడుతుందని సర్వే ఏజెన్సీలతో పాటు ఇంటెలిజెన్స్​ నివేదికలు చెప్తున్నాయి. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర కాంగ్రెస్​లో కొత్త జోష్​ వచ్చింది. 

తుక్కుగూడ బహిరంగ సభలో సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో తాము పవర్​లోకి రావడం పక్కా అని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. సొంతంగానే అధికారంలోకి వస్తామని పైకి చెప్తున్నా.. ఇంటర్నల్​ డిస్కషన్స్​ లో మాత్రం హంగ్​ అసెంబ్లీనే అని కాంగ్రెస్​ లీడర్లు అంటున్నారు. తెలంగాణలో రాబోయేది హంగ్​ అసెంబ్లీనే అని బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్​ సంతోష్​ అభిప్రాయపడ్డారు. అప్పుడు బీజేపీనే కీలకమవుతుందని ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. 

మూడేండ్లుగా తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం ఎక్కువగా ఫోకస్​ పెట్టింది. బీఆర్ఎస్​ కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికలను చాలెంజ్​గా  తీసుకుంది.  మూడోసారి తమనే గెలిపించాలంటూ మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు రాష్ట్రమంతటా పర్యటిస్తున్నారు. బీఎల్​ సంతోష్​ కామెంట్స్​ మైండ్​ గేమ్​అని.. తెలంగాణలో కచ్చితంగా పవర్​లోకి  రాబోయేది బీఆర్​ఎస్సేనని మంత్రి హరీశ్​ రావు అన్నారు.  దక్షిణాదిన హ్యాట్రిక్​ కొట్టే సీఎం  కేసీఆర్​ మాత్రమేనని మంత్రి కేటీఆర్​ తెలిపారు.