- హుజూరాబాద్ బైపోల్ తర్వాత టీఆర్ఎస్లో తిరుగుబాటు
- గుజరాత్తో పాటే తెలంగాణకు ఎన్నికలు
- హుజూరాబాద్ బైపోల్ తర్వాత టీఆర్ఎస్లో తిరుగుబాటు
- అందుకే సభలు, ప్లీనరీ అంటూ హడావుడి
- హరీశ్రావును బయటకు పంపుతరని కామెంట్
హైదరాబాద్, వెలుగు : సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఖాయమని, గుజరాత్ ఎన్నికలతో పాటు రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చెప్పారు. హుజూరాబాద్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్లో చాలా మార్పులు వస్తాయని, ఆ పార్టీలో తిరుగుబాటు వస్తుందని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే కేసీఆర్ సభలు, ప్లీనరీ అంటూ హడావుడి చేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్కు భయం పట్టుకుందని, ఆ భయాన్ని బయటపడనీయకుండా ఉండేందుకే విజయ గర్జన సభ నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. ‘‘ఇప్పుడు కేసీఆర్ సాధించిన విజయాలు ఏమున్నాయని సభ పెడుతున్నరు? టీఆర్ఎస్కు ఇవే చివరి సభలు అవుతయ్. ముందస్తు రాదని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది” అని అన్నారు.
‘‘పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు కలిసి రావు. నిర్ణీత సమయానికి ఆరు నెలల ముందే అసెంబ్లీ ఎన్నికలు వస్తయ్. ముందస్తు ఎన్నికలంటే పార్టీలో మరింత గందరగోళం వస్తుందని కేసీఆర్ మాట మార్చి చెప్తున్నరు. ఆ పార్టీకి ప్రతి నియోజక వర్గంలో నాయకులకు టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే నాయకులు ముందస్తుగా అలర్ట్ కాకుండా కేసీఆర్ డ్రామా ఆడుతున్నరు. కానీ, టీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలన్నీ ముందస్తు ఎన్నికల కోసమే” అని రేవంత్ చెప్పారు. సోమవారం సీఎల్పీలో ఆయన మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు. సర్కార్ను నడపాల్సిన సమయంలో కేసీఆర్ పార్టీపై దృష్టి సారిస్తున్నారంటేనే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ‘‘ముందస్తు ఎన్నికల గురించి ఎవరూ అడగకున్నా కేసీఆర్ తనంతట తాను ప్రస్తావించారు. మంత్రి హరీశ్ రావును కేసీఆర్ త్వరలో పార్టీ నుంచి బయటకు పంపుతరు. 2022 ఆగస్టు 15 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లవుతుందని, ఈ సందర్భంగా కేసీఆర్ ఎన్నికలకు వెళ్తారు” అని అభిప్రాయపడ్డారు. మోడీ డైరెక్షన్లో కేసీఆర్ ఎన్నికలకు వెళ్తారని, గుజరాత్తోపాటే తెలంగాణ ఎన్నికలు వస్తాయన్నారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసే కుట్ర జరుగుతోందన్నారు. హుజూరాబాద్లో ఈటల గెలిచినా, ఓడినా ఎవరికీ లాభం లేదన్నారు. యూపీ ఎన్నికల్లో కేసీఆర్ బీజేపీకి సహకరిస్తారని, దాని వెనక అంతర్గత ఒప్పందం కుదిరిందన్నారు.
దళిత బంధును ఎగ్గొడ్తడు
సీఎం కేసీఆర్ దళిత ద్రోహి అని, ఆయన పార్టీలో వాళ్లకు ప్రాధాన్యతే లేదని రేవంత్ అన్నారు. దళిత బంధును కేసీఆర్ ఎగ్గొట్టే స్కీంగా మారుస్తారని ఆయన విమర్శించారు. దళితులు వాస్తవానికి ఏబీసీడీ వర్గీకరణ చేయాలని అడిగారని, ఈ విషయాన్ని కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. ప్రధాని మోడీని ఎన్నో సార్లు కలుస్తున్న కేసీఆర్ ఎందుకు వర్గీకరణ గురించి ఆయనను అడగడం లేదని రేవంత్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పార్టీ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేసే సమయంలో ఒక్క దళితుడు కూడా ఆయనతో లేరన్నారు.