
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తేదీ ఖరారయ్యింది. ఆగస్టు 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మూడు లేదా ఐదు రోజుల పాటు అసెంబ్లీ జరిగే అవకాశం ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలక అంశాలపై చర్చించే చాన్స్ ఉంది .. ఆగస్టు 29న కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సెషన్ ఎజెండా ఖరారు చేయనుంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు,బీసీ రిజర్వేషన్లపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది.
ఈ సమావేశాల్లో మొదటి రోజున ఇటీవల మృతిచెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు మొదటి రోజు సభలో సంతాపం ప్రకటించనున్నారని సమాచారం. ఉప సభాపతి ఎన్నిక కూడా ఇదే సెషన్ లో ఉండనుంది. కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు ఆవశ్యకత.. నిర్మాణ, డిజైనింగ్ లోపాలపై అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నివేదికలో ప్రధానంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్లు ప్రధానంగా ప్రస్తావనకు రానున్నాయి. ఇందులో మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుతం గజ్వేల్ ఎమ్మెల్యేగా, హరీశ్ రావు సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. వీళ్లిద్దరూ హౌస్ సభ్యులు. ఈటల రాజేందర్ ప్రస్తుతం మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్నారు. హైకోర్టులో చుక్కెదురైన తర్వాత మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు తరుచూ మాజీ సీఎం కేసీఆర్ ను కలిసేందుకు ఫాంహౌస్ వెళ్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కూడా ఫాంహౌస్ కు వెళ్లి భేటీ అయ్యారు. అసెంబ్లీలో నివేదిక ప్రవేశపెడితే అనుసరించాల్సిన వ్యూహంపైనే ప్రధానంగా చర్చిస్తున్నారని సమాచారం..