- బండి సంజయ్పై చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఫైర్
- ‘మరి అంబేద్కర్కు సీఎం ఎందుకు నివాళులర్పించట్లే?’
- ప్రశ్నించిన మీడియా ప్రతినిధులు
వరంగల్ రూరల్, వెలుగు: గ్రేటర్ వరంగల్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ లీడర్ల ప్రెస్మీట్లో ‘బీఆర్ అంబేద్కర్కు నివాళులు’ అంశం హాట్ టాపిక్గా మారింది. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ వరంగల్ పర్యటనపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్కుమార్, చీఫ్ విప్ వినయ్భాస్కర్, మాజీ డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య, ఎంపీ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య శనివారం హన్మకొండలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంజయ్పై విమర్శలు చేసే క్రమంలో వినయ్ భాస్కర్.. అంబేద్కర్ అంశాన్ని తీసుకొచ్చారు. ‘‘సంజయ్ వరంగల్ పర్యటన సందర్భంగా కనీసం హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సెల్ఫీ తీసుకోవాలనే ఆలోచన చేయలేదు” అంటూ ఫైర్ అయ్యారు. దీంతో ‘‘సీఎం కేసీఆర్.. గత మూడేండ్లుగా అంబేద్కర్ జయంతి కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనడం లేదు? అంబేద్కర్ ఫొటోకు, విగ్రహానికి ఎందుకు నివాళులర్పించట్లేదు?’’ అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఊహించని ఈ ప్రశ్నతో అక్కడున్న టీఆర్ఎస్ సీనియర్ లీడర్లతోపాటు చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఉక్కిరిబిక్కిరయ్యారు. విషయాన్ని కవర్ చేసేందుకు ప్రయత్నించారు. బండి సంజయ్ తన వరంగల్ పర్యటనలో అంబేద్కర్ జంక్షన్ డెవలప్మెంట్ చూడటానికి వస్తే బాగుండేదని వినయ్ భాస్కర్ చెప్పుకొచ్చారు. మరి, అంబేద్కర్కు సీఎం నివాళుల మాటేంటని ప్రశ్నించగా.. మంత్రి ఎర్రబెల్లి టాపిక్ డైవర్ట్ చేశారు. ఈ టైంలో ఆ అంశం వద్దంటూ దాటవేశారు. బీజేపీ ఎంపీలు తమ ప్రాంతాలకు ఎన్ని ఫండ్స్ తెచ్చారో అడగడమే తమ ఉద్దేశమని, నివాళులు కాదంటూ ప్రెస్మీట్ క్లోజ్ చేశారు.