
మునుగోడు సిట్టింగ్ సీటును దక్కించుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆధిపత్య పోరుకు చెక్ పెట్టి...కేడర్ లో ఉత్సాహం నింపేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులను ఢిల్లీకి రావాలని అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ప్రధానంగా మునుగోడు బై ఎలక్షన్ పై హస్తం పార్టీ నేత ప్రియాంక గాంధీ ప్రత్యేక దృష్టి సారించారు. ఎల్లుండి ప్రియాంక గాంధీ, వేణు గోపాల్, మాణిక్కం ఠాగూర్ నేతృత్వంలో సమావేశం జరగనుంది. మునుగోడు ఉప ఎన్నిక పై అధిష్టానం వ్యూహ రచన చేయనుంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఉన్న కీలక ఆయుధాల్లో ప్రియాంక గాంధీని నేరుగా రంగంలోకి దింపాలనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఆమె ఎంట్రీతో పార్టీ నేతలు స్వయంగా అధిష్టానంతో మాట్లాడిన ఫీలింగ్ ఉంటుందని భావిస్తున్నారు. దీంతో వర్గపోరుకు చెక్ పెట్టొచ్చనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో అధికారం దక్కించుకునేందుకు ప్రియాంకకు తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.