- రాష్ట్రంలో ప్రమాదకరంగా సైబర్ నేరాలు: డీజీపీ శివధర్ రెడ్డి
- అవగాహనతోనే ఆ పీడను వదిలించుకోగలమని వెల్లడి
- సీఎస్బీ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్పై అవేర్నెస్ క్యాంపెయిన్
హైదరాబాద్, వెలుగు: ప్రతి ఒక్కరికీ సైబర్ క్రైమ్ ఒక పీడగా మారిందని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. పది, పన్నెండ్ల క్రితం బందిపోట్లు, దోపిడీ దొంగలు, ఇండ్లలో చోరీల భయం ఉండేదని, కానీ ఇప్పుడు సైబర్ క్రైమ్ జనాన్ని భయపెడుతున్నదని అన్నారు. చాలా మంది అత్యాశకు పోయి పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోతున్నారన్నారు.
సెల్ ఫోన్లతో నేరస్తులు ఇంట్లోనే కూర్చొని కోట్లు కొట్టేస్తున్నారన్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్బీ) ఆధ్వర్యంలో ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ క్యాంపెయిన్ ను సీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్ తో కలిసి డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వారాల పాటుఈ అవగాహన కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
రోజుకు రూ.4 కోట్లు కోల్పోతున్నరు
తెలంగాణలో ప్రజలు రోజుకు రూ.4 కోట్లు సైబర్ మోసాల ద్వారా కోల్పోతున్నారని సీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్ తెలిపారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటైన నాటి నుంచి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా 2.44 లక్షల ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. విద్యా సంస్థల్లో అవగాహన కల్పించేందుకు స్పార్క్ సైబర్ క్లబ్స్ (స్టూడెంట్ ప్రొగ్రామ్ ఫర్ అవేర్నెస్ అండ్ రెస్పాన్సిబుల్ సైబర్ స్పేస్) ప్రారంభించామన్నారు.
6 వారాల పాటు అవేర్నెస్ క్యాంపెయిన్ ఇలా
1వ వారం: హెల్ప్లైన్ నంబర్1930, గోల్డెన్ అవర్ రిపోర్టింగ్, డబ్బులు ఫ్రీజ్ చేసే విధానం
2వ వారం: డిజిటల్ అరెస్ట్, సెక్స్టార్షన్, సైబర్ స్లేవరీ
3వ వారం: ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, లోన్ యాప్స్, ఫేక్ రివార్డ్స్
4వ వారం: హ్యాకింగ్, రాంసమ్వేర్, ఫేక్ యాప్స్, బుల్లీయింగ్
5వ వారం: ఐడెంటిటీ థెఫ్ట్, ఇంపర్సోనేషన్, ఓటీపీ, కైవైసీ ఫ్రాడ్స్
6వ వారం: మహిళలు, చిన్నారులకు ఆన్లైన్ ముప్పుపై అవగాహన
