- ఆగస్ట్ చివరికల్లా నిర్మించుకోవాలె
- ఉత్తర్వులిచ్చిన డీహెచ్
హైదరాబాద్, వెలుగు: కరోనా ఎఫెక్ట్ మేరకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు తప్పనిసరిగా ఉండాల్సిందేనని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డాక్టర్ శ్రీనివాసరావు గురువారం ఉత్తర్వులిచ్చారు. ఆగస్టు చివరికల్లా ప్లాంట్లు నిర్మించుకోవాలని సూచించారు. బెడ్ల కెపాసిటీకి అనుగుణంగా ప్లాంట్ కెపాసిటీ ఉండాలన్నారు. ఈ ఉత్తర్వులు సీరియస్గా తీసుకోవాలని, ప్లాంట్లు నిర్మించుకోని హాస్పిటళ్ల పర్మిషన్ రద్దు చేస్తామని హెచ్చరించారు. వంద కంటే తక్కువ బెడ్లు ఉన్న హాస్పిటళ్లకు ప్రస్తుతానికి మినహాయింపు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 55 ప్రభుత్వ దవాఖాన్లలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని శ్రీనివాస రావు వెల్లడించారు.
కెపాసిటీ ఇలా..
వంద నుంచి రెండొందల బెడ్ల హాస్పిటల్స్లో నిమిషానికి ఐదొందల లీటర్ల ఆక్సిజన్ సరఫరా చేసే కెపాసిటీ ఉన్న ప్లాంటు ఉండాలి. 200 నుంచి 500 బెడ్లు ఉన్న హాస్పిటల్స్లో నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్ సరఫరా చేసే ప్లాంట్ ఉండాలి. ఐదొందల కంటే ఎక్కువ బెడ్లు ఉన్న హాస్పిటల్స్లో కనీసం నిమిషానికి 2 వేల లీటర్ల ఆక్సిజన్ సరఫరా చేసే ప్లాంట్లు ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.