- రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి సూచన
- గ్రామపాలన ఆఫీసర్ల అసోసియేషన్ తెలంగాణ ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు: గ్రామపాలన అధికారులు ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి సూచించారు. ఆదివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ తెలంగాణ (జీపీఓ ఏటీజీ) ఆవిర్భావ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జీపీఓ ఏటీజీ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.
రాష్ట్ర అధ్యక్షుడిగా గరికె ఉపేంద్రరావు, మహిళా అధ్యక్షురాలుగా కంది శిరీషా రెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా అర్జున్ మల్లారం, ఆర్.విజయ్కుమార్, కోశాధికారిగా ఇంజమూరి ఈశ్వర్, జనరల్ సెక్రటరీగా వి.లక్ష్మినర్సింహులు, దాసరి వీరన్న, అసోసియేట్ అధ్యక్షులుగా ఏవీ జ్యోతిరెడ్డి, కారుమూరి చంద్రయ్య, చిరంజీవి ఎన్నికయ్యారు.
అలాగే ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, ఆర్గనైజింగ్, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, కల్చరల్ కార్యదర్శులు, స్పోర్ట్స్ కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులను కూడా ప్రకటించారు. ఈ సందర్భంగా లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. జీపీవోల సమస్యలను పరిష్కరించే బాధ్యత గ్రామపాలన ఆఫీసర్ల అసోసియేషన్ తీసుకుంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.రామకృష్ణ, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.రాములు, పాక రమేశ్, టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర కార్యదర్శి వి.భిక్షం తదితరులు పాల్గొన్నారు.
