- లోయర్ ట్యాంక్బండ్లో పాత బిల్డింగ్ స్థానంలో కొత్త టవర్
- 10 అంతస్తుల బిల్డింగ్ నిర్మాణానికి సర్కారు జీవో జారీ
హైదరాబాద్, వెలుగు: లోయర్ ట్యాంక్బండ్లోని పాత అంబేద్కర్ భవనం స్థానంలో రూ.108 కోట్లతో అంబేద్కర్ నాలెడ్జ్ టవర్ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎస్సీ సంక్షేమ శాఖ కార్యదర్శి విజయేందిర బోయి గురువారం జీవో జారీ చేశారు. సెల్లార్, గ్రౌండ్ఫ్లోర్తో పాటు మరో 10 అంతస్తులతో టవర్ను నిర్మించనున్నారు. నిర్మాణానికి రూ.108 కోట్లు ఖర్చవుతాయని ఆర్అండ్బీ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం లోయర్ ట్యాంక్బండ్లో ఉన్న జీ ప్లస్1 పాత భవనం 12 ఏండ్లుగా నిరుపయోగంగా ఉంది.
దాని స్థానంలోనే కొత్త టవర్ను నిర్మించనున్నారు. టవర్కు అవసరమైన ఆర్కిటెక్చర్, స్ట్రక్చరల్ డిజైన్ కోసం నిపుణుల సేవలు తీసుకోనున్నారు. పనులను త్వరగా ప్రారంభించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ను సర్కారు ఆదేశించింది. టవర్ నిర్మాణానికి సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ పలుమార్లు స్థలాన్ని పరిశీలించారు. ఎస్సీల ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ తెలిపారు.
