
- బాగుంది, పర్వాలేదు, బాగాలేదు, చెప్పలేం’ అనే 4 ఆప్షన్స్
- ఎవరు సర్వే చేస్తున్నారో తెలియక ఎమ్మెల్యేల గందరగోళం
- లోకల్ ఎలక్షన్స్ నేపథ్యంలో సీఎంవో నుంచే సర్వే చేయిస్తున్నారనే టాక్
- ఇప్పటికే ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోనే ఉండాలని సీఎం ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎమ్మెల్యేల పనితీరు తెలుసుకునేందుకు సర్వే జరుగుతున్నది. నియోజకవర్గాలవారీగా ఓటర్లకు ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి. ‘‘మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది?’’ అని అడుగుతూ, ‘బాగుంది, పర్వాలేదు, బాగాలేదు, చెప్పలేం’ అనే 4 ఆప్షన్లతో సమాధానాలు సేకరిస్తున్నారు. కానీ, ఈ సర్వే ఎవరు చేస్తున్నారు? అనే సంగతి తెలియక ఎమ్మెల్యేలు గందరగోళంలో ఉన్నారు. ప్రభుత్వమే థర్డ్ పార్టీ ఏజెన్సీతో సర్వే చేయిస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాదిన్నర కావస్తున్నది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఎంత సమర్థవంతంగా పనిచేశారు? స్థానిక సమస్యలను పరిష్కరించడంలో, అభివృద్ధి పనులను చేపట్టడంలో వారి పాత్ర ఎలా ఉంది? ఎమ్మెల్యేలు ప్రజలతో ఎంతవరకు అనుసంధానమయ్యారు? స్థానిక అవసరాలను ఎలా తీర్చారు? ప్రభుత్వ పథకాలను ప్రజలకు ఎంతవరకు చేరవేశారు? అనే అంశాలను తెలుసుకునేందుకు ఈ సర్వే చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఎమ్మెల్యేల వ్యక్తిగత పనితీరుతోపాటు అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని కూడా అంచనా వేయవచ్చనే కోణంలోనే ఈ సర్వే చేస్తున్నట్టు చర్చ నడుస్తున్నది. ఒకవేళ ఎమ్మెల్యేల పనితీరు బాగున్నా, ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నట్లు సర్వేలో తేలితే.. అది పార్టీ హైకమాండ్ కు కీలక సంకేతంగా మారనుంది.
అదే సమయంలో, ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేకపోతే, దాని ప్రభావం ప్రభుత్వ ఇమేజ్పై పడే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ ఫోన్ కాల్ సర్వే కీలకంగా మారింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో వన్టు వన్ భేటీ అవుతూ ఫీడ్ బ్యాక్ తీసుకోవడమే కాకుండా ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ పైనా చర్చిస్తున్నారు. హైదరాబాద్లో కాకుండా తమ నియోజకవర్గాల్లోనే ఉండాలని ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆదేశాలిచ్చారు. స్థానిక ఎన్నికలు దగ్గరలో ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు ప్రజలతో మమేకం కావాలని, స్థానిక సమస్యలపై దృష్టి పెట్టాలని సీఎం సూచించినట్లు తెలుస్తున్నది. ఈ ఆదేశాలతో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో యాక్టివ్గా కనిపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సమావేశాలు, పట్టణాల్లో ప్రజలతో సమస్యలపై చర్చలు, అభివృద్ధి పనుల పరిశీలన వంటివి చేస్తూ బిజీగా గడుపుతున్నారు.
ఎమ్మెల్యేల్లో ఆందోళన
సర్వే గురించి స్పష్టత లేకపోవడంతో ఎమ్మెల్యేల్లో కొంత ఆందోళన నెలకొన్నది. తమ పనితీరుపై ఓటర్లు ఏం చెబుతారు? ఈ సర్వే ఫలితాలు పార్టీ హైకమాండ్కు చేరుతాయా? అనే ఆలోచనలు వారిని వెంటాడుతున్నాయి. ముఖ్యంగా, గత ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేలు లేదా నియోజకవర్గంలో వివాదాలు ఎదుర్కొన్న వారు ఈ సర్వే ఫలితాలపై ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు తమ సన్నిహితుల ద్వారా సర్వే గురించి సమాచారం సేకరిస్తున్నారు. ఓటర్లు ఏ ఆప్షన్ ఎంచుకుంటున్నారు? తమ పనితీరుపై ప్రజల అభిప్రాయం ఏమిటి? అని తెలుసుకునే పనిలో పడ్డారు. కాగా, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల్లో అధిక సీట్లు సాధిస్తే, అది అధికార పార్టీకి ఊపు తెచ్చే అంశం.
అందుకే, ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేల పాత్ర చాలా కీలకం. వారి నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలపై ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేయడం ద్వారా పార్టీ హైకమాండ్, ప్రభుత్వం తమ ప్రణాళికలను అమలు చేసేందుకు వీలవుతుందని అంచనా వేస్తున్నట్టు తెలుస్తున్నది. మరోవైపు స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ కూడా బలంగా పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేల సామర్థ్యాన్ని ముందుగానే అంచనా వేసి, అవసరమైన చోట పనిచేయించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.