
- ఈ – హోల్సేల్, రిటైల్ షాపుల్లో తక్కువ ధరకే అమ్మకాలు
- కలుపు మందును తట్టుకునే బీటీ 3, హెచ్టీ కాటన్ విత్తనాలు అక్రమంగా సప్లయ్
- అడిషనల్ డీజీ పర్యవేక్షణలో స్పెషల్ టాస్క్ఫోర్స్కు సర్కారు ఏర్పాట్లు
- వ్యవసాయ శాఖ, సీడ్స్ కంపెనీల ప్రతినిధులతో రైతుల్లో అవగాహన
హైదరాబాద్, వెలుగు: వర్షాకాలం ప్రారంభం కావడంతో రాష్ట్రంలో నకిలీ విత్తనాల ముఠాల కదలికలు మొదలయ్యాయి. పత్తి సహా ఇతర నకిలీ విత్తనాలను మార్కెట్లోకి తరలించేందుకు అంతర్రాష్ట్ర ముఠాలు ప్లాన్ చేస్తున్నాయి. ప్రధానంగా నిషేధిత బీటీ-3, హెచ్టీ కాటన్ (హెర్బిసైడ్ టాలరెన్స్) లాంటి కలుపు మందులను తట్టుకునే నకిలీ విత్తనాలు ప్రతి సంవత్సరం భారీగా మార్కెట్లోకి వస్తున్నాయి. తక్కువ ధరకు లభించే ఇలాంటి విత్తనాలను కొనుగోలు చేసి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో నకిలీ విత్తనాల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది.
ఈ మేరకు అడిషనల్ డీజీ ఆధ్వర్యంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, విత్తన సర్టిఫికేషన్, సీడ్ కార్పొరేషన్ అధికారులతో స్పెషల్ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నారు. అన్ని జిల్లాల యూనిట్ల పోలీసులు, వ్యవసాయ శాఖ, విత్తన కంపెనీలతో కలిపి ఆకస్మిక దాడులు నిర్వహించనున్నారు. దీంతో పాటు నకిలీలు, నాసిరకం విత్తనాలపై రైతుల్లో అవగాహన కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
నకిలీ విత్తనాలతో నష్టపోతున్న రైతాంగం
రాష్ట్రంలో రైతులు పత్తి సాగుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి నాసిరకం విత్తన ముఠాల ఏజెంట్లు రాష్ట్ర రైతాంగాన్ని టార్గెట్ చేశాయి. ప్రధానంగా కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, కర్నూలు, ప్రకాశం, నంద్యాల జిల్లాల నుంచి ప్రతి ఏటా పెద్ద ఎత్తున్న నకిలీ విత్తనాలు సరఫరా అవుతున్నాయి. ప్రముఖ కంపెనీలకు చెందిన నకిలీ లేబుల్స్, ఆకర్షించే ప్యాకింగ్తో రాష్ట్ర వ్యాప్తంగా హోల్సేల్, రిటైల్సీడ్స్షాపులకు తరలిస్తున్నాయి.
డీలర్లకు, షాపుల యజమానులకు ఎక్కువ మొత్తంలో కమీషన్లు, లాభాలు ఆశ చూపుతున్నాయి. మరోవైపు లైసెన్స్డ్డీలర్ల కంటే బయటి వ్యక్తుల వద్ద విత్తనాలు తక్కువ ధరకు లభిస్తుండటంతో రైతులు వాటినే కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రతి ఏటా పోలీసులు జరుపుతున్న దాడుల్లో నిషేధిత (బీటీ-3) విత్తనాలతో పాటు హెచ్టీ కాటన్(హెర్బిసైడ్టాలరెన్స్) విత్తనాలు అత్యధికంగా పట్టుబడుతున్నాయి.
నిషేధిత బీటీ 3,హెచ్టీ కాటన్ సీడ్స్ అక్రమ రవాణా
బీటీ 3,హెచ్టీ కాటన్ సీడ్స్ జన్యు మార్పిడి చేసిన పత్తి విత్తనాలుగా ఇప్పటికే వ్యవసాయ రంగ నిపుణుల పరిశోధనల్లో వెల్లడైంది. ఈ విత్తనాలు గ్లైఫోసెట్ అనే కలుపు మందును తట్టుకుంటాయి. గ్లైఫోసెట్ పత్తి పంటను కాకుండా కలుపు మొక్కలను మాత్రమే నాశనం చేస్తుంది. అయితే, గ్లైఫోసెట్ క్యాన్సర్ వ్యాధికి కారకమని, పర్యావరణానికి కూడా హాని కలిగిస్తున్నందున దీన్ని కొన్ని సంవత్సరాల క్రితమే నిషేధించారు. నాణ్యమైన విత్తనాలతో చేసే సాగుతో పోల్చితే తక్కువ ధరకు లభించే నకిలీ విత్తనాలతో చేసే సాగుకు పెట్టుబడిలో భారీగా వ్యత్యాసాలు ఉన్నాయి. దీంతో రైతులు నాసిరకం విత్తనాల వైపే మొగ్గు చూపుతున్నట్లు వ్యవసాయ అధికారులు, పోలీసుల పరిశీలనలో వెలుగుచూసింది. ఇలా ప్రతి సంవత్సరం నకిలీ విత్తనాల దిగుమతి భారీగా పెరిగిపోతోంది.
ఆకస్మిక తనిఖీలకు రంగం సిద్ధం
సీజన్ ప్రారంభం నుంచే దాడులు ముమ్మరం చేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాల ముఠాలు ప్రవేశించే అవకాశాలున్న అన్ని బార్డర్ల వద్ద పోలీసులు ఇప్పటికే నిఘా ఏర్పాటు చేశారు. ఇప్పటికే బార్డర్ జిల్లాల పోలీసులు, వ్యవసాయ శాఖ, వివిధ సీడ్స్ కంపెనీలతో నిఘా పెట్టారు. గతంలో పట్టుబడ్డ ముఠాల కదలికలు, డీలర్స్, హోల్సేల్, రిటైల్ మార్కెట్కు సప్లయ్ అవుతున్న విత్తనాలను గుర్తిస్తున్నారు. ఆకస్మిక దాడులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నకిలీ విత్తనాలను సప్లయ్ చేస్తూ పట్టుబడితే నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయనున్నారు. మూడుసార్ల కంటే ఎక్కువ పట్టుబడిన నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.