
- వరద ముప్పు కట్టడికి యాక్షన్ ప్లాన్
- రెయిన్ గేజింగ్ స్టేషన్, సెన్సార్లు అప్రమత్తం
- ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం
- 70 మంది పోలీసులకు వరదపై పూర్తయిన శిక్షణ
నిర్మల్, వెలుగు: ఏటా వర్షాకాలంలో డేంజర్ జోన్లో ఉండే కడెం లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసేందుకు ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. లోతట్టు గ్రామాలను అప్రమత్తం చేసేందుకు అలారం సిస్టంను ఏర్పాటు చేయనుంది. దాదాపు మూడేళ్లుగా కడెం ప్రాజెక్టు లోకి లక్షల క్యూసెక్కుల వరద రావడంతో రిపేర్లు లేక, గేట్లు ఎత్తలేని పరిస్థితి తలెత్తడంతో పలుమార్లు ప్రాజెక్టుపై నుంచి నీరు ప్రవహించింది. వరద ఉధృతికి నీటిని కిందకు వదలడంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయేవి. కొన్నిసార్లు ఉధృతి పెరగడంతో ప్రాజెక్టు గేట్లు అప్పటికప్పుడు పైకెత్తి ఆ వరదను దిగువకు విడుదల చేస్తుంటారు. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహ సమాచారాన్ని లోతట్టు ప్రాంతాలకు తెలపడం అధికారులకు కత్తి మీద సాములా ఉండేది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు 14 లోతట్టు గ్రామాల్లో వరద హెచ్చరికల అలారాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్నారు.
రూ.10 కోట్లతో రిపేర్లు
బీఆర్ఎస్ హయాంలో పదేండ్లపాటు ప్రాజెక్టు రిపేర్లకు నిధులు విడుదల చేయకపోవడంతో సమస్య ఏటా తీవ్రమైంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ఈ ప్రాజెక్టు పై ఫోకస్ పెట్టారు. రిపేర్లకు రూ.10 కోట్లు మంజూరు చేయించి పనులు పూర్తిచేయించారు. రిపేర్లు పూర్తికావడంతో గత వర్షాకాలంలో ఎగువ నుంచి వచ్చే వరద నీటిని అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ దానికి అనుగుణంగా గేట్లు పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో లోతట్టు ప్రాంతాలకు, పంట పొలాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. దాదాపు 68 వేల ఎకరాల పంట భూములు వరద ముంపు నుంచి బయటపడ్డాయి.
14 లోతట్టు గ్రామాల్లో అలారాల ఏర్పాటు
అయితే ప్రాజెక్టు వరద కారణంగా 14 లోతట్టు గ్రామాలు ముంపునకు గురవుతున్న నేపథ్యంలోనే ఆయా గ్రామాల్లో ప్రభుత్వం అలారం సిస్టంను ఏర్పాటుచేయనుంది. కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసేకంటే ముందుగానే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా అలారాలను గ్రామాల్లో మోగించనున్నారు. అలారం మోగగానే గోదావరి నది వైపు పశువుల కాపరులు, ప్రజలు వెళ్లకూడదంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేయనున్నారు. అలారం మోతతో వరద విపత్తుల గురించి ప్రజలకు ముందుగానే సమాచారం అందనుంది. ఇందుకు సంబంధించి కలెక్టర్ అభిలాష అభినవ్ సమీక్ష సమావేశం
నిర్వహించి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.
నాలుగు చోట్ల రెయిన్ ఫాల్ గేజ్ స్టేషన్లు, సెన్సార్ల ఏర్పాటు
ఇదివరకు ప్రాజెక్టులో రెయిన్ ఫాల్ గేజ్ స్టేషన్లు లేకపోవడంతో వరద ఉధృతిని అధికారులు అంచనా వేయలేకపోయారు. వీటి నాలుగు చోట్ల ఏర్పాటు చేశారు. వరద ఉధృతిని పక్కాగా లెక్కగట్టి దానికి అనుగుణంగా గేట్లను పైకెత్తుతూ దిగువకు నీరును విడుదల చేయనున్నారు. మందపల్లి వద్ద గల పలికేరు వాగుపై, కడెం నది తాటిగూడ వద్ద, చిక్ మాన్ వాగు, కుప్టి వాగు వద్ద ఈ స్టేషన్లను ఏర్పాటు చేశారు. గేజింగ్ స్టేషన్లకు సెన్సార్లను అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు వరద ఉధృతిని తెలుసుకుంటూ దానికి అనుగుణంగా ప్రాజెక్టు గేట్లను పైకెత్తి దిగువకు నీటిని వదలనున్నారు.
ఎస్డీఆర్ఎఫ్ కింద 70 మంది సిబ్బందికి శిక్షణ
వరద విపత్తులను ఎదురుకోవడంపై ఎస్డీఆర్ఎఫ్ కింద నిర్మల్ జిల్లాలో ఇప్పటికే 70 మంది పోలీసులు ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. అలాగే మరో 150 మంది పోలీసులకు కూడా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కేవలం కడెం ప్రాజెక్టుతోపాటు స్వర్ణ, గడ్డెన వాగు ప్రాజెక్టులు, భారీ చెరువుల వరదల సమయంలోనూ రక్షణ చర్యలను చేపట్టనున్నారు. వరద విపత్తులను ఎదుర్కొనేందుకు పోలీసులు ఆధ్వర్యంలో ఎయిర్ బోర్డ్స్, లైవ్ జాకెట్స్, ట్యూబ్స్, రూప్స్ లాంటి పరికరాలన్నింటినీ పోలీస్ శాఖ ఇప్పటికే సిద్ధం చేసింది. అలాగే పోలీస్ స్టేషన్లతో పాటు రెవెన్యూ ఆఫీసుల్లో హెల్ప్ డెస్క్, టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంచనున్నారు. ఇటీవల ఏర్పాటుచేసిన శివంగి టీంలను కూడా అవసరమైతే రంగంలోకి దించేందుకు పోలీస్ శాఖ సిద్ధమవుతోంది.