రైతులకు గుడ్ న్యూస్: PACSల ద్వారా యూరియా పంపిణి ..పాలేరు సెగ్మంట్ పైలట్ ప్రాజెక్ట్.. సెప్టెంబర్ 3 నుంచి రైతులకు అందజేత

రైతులకు గుడ్ న్యూస్:  PACSల ద్వారా యూరియా పంపిణి ..పాలేరు సెగ్మంట్ పైలట్ ప్రాజెక్ట్.. సెప్టెంబర్ 3 నుంచి రైతులకు అందజేత
  • యూరియా సక్రమ పంపిణీకి సర్కార్ చర్యలు 
  • పాలేరు సెగ్మెంట్ పరిధిలో సెప్టెంబర్​ 3నుంచి అమలు
  • పీఏసీఎస్​ల ద్వారానే నేరుగా రైతులకు అందజేత 
  •  అదనంగా మరో34 సబ్ సెంటర్లు ఏర్పాటు 
  • ఈ సీజన్ లో ప్రైవేటు వ్యాపారులకు పూర్తిగా బంద్ 
  • మంత్రి పొంగులేటి ఆదేశాలతో అధికారులు ఏర్పాట్లు

ఖమ్మం, వెలుగు : రైతులకు యూరియా పంపిణీలో కొరత రాకుండా,  సక్రమంగా సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఆదేశాలతో సొంత సెగ్మెంట్ పాలేరులో తొలిసారిగా పైలట్ ప్రాజెక్టు ద్వారా యూరియాను రైతులకు పంపిణీ చేస్తారు. ఇది సక్సెస్​అయితే రాష్ట్రమంతటా ఇంప్లిమెంట్ చేయొచ్చని ఖమ్మం జిల్లా అధికారులు చెప్పారు.  యూరియాను ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్​)కు, వాటి పరిధిలోని  సబ్​సెంటర్లకు పంపిణీ చేస్తారు. అనంతరం నేరుగా రైతులకు యూరియా అందించేందుకు ప్లాన్​చేశారు.  

ప్రైవేట్ వ్యాపారులు, డీలర్లు యూరియాను బ్లాక్​మార్కెట్ కు తరలించే చాన్స్ లేకుండా కట్టుదిట్టంగా పంపిణీ చేపడతారు. పాలేరు నియోజకవర్గానికి తాజాగా 45 మెట్రిక్​ టన్నుల యూరియాను కేటాయించారు. ఇది మంగళవారం సబ్​సెంటర్లకు చేరుకోనుంది. బుధవారం నుంచి రైతులకు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.  

వందశాతం రైతులకు పంపిణీ చేసేందుకుఇప్పటివరకు యూరియాను 60 శాతం పీఏసీఎస్​లకు కేటాయిస్తుండగా, 40 శాతం ప్రైవేట్ డీలర్లకు ప్రభుత్వం ఇస్తుంది. ఇకముందు ప్రైవేట్ డీలర్లకు నిలిపివేసి, కేవలం పీఏసీఎస్​లు, సబ్​సెంటర్ల ద్వారానే పంపిణీ చేయనుంది. పాలేరు సెగ్మెంట్ పరిధిలో 16 పీఏసీఎస్​లు ఉండగా.. యూరియాను త్వరగా, సులభంగా రైతులకు అందించేందుకు ఆయా పీఏసీఎస్​ల పరిధిలో 34 సబ్​సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు.

 ప్రతి 2,500 ఎకరాలకు ఒకటి చొప్పున మొత్తం 50  కేంద్రాల ద్వారా నేరుగా రైతులకు అందజేస్తారు. సబ్​సెంటర్లకు వ్యవసాయ విస్తరణ అధికారులు ఇన్ చార్జ్ లుగా ఉంటారు. ఇప్పటికే సెంటర్ల నిర్వహణకు పంచాయతీరాజ్​, రెవెన్యూ, వ్యవసాయ, ఇతర శాఖల నుంచి అవసరమైన సిబ్బందిని డిప్యూటేషన్​పై నియమించారు. స్టాక్​అమ్మేందుకు కావాలసిన ఈ పోస్​మెషీన్లను 70 వరకు అందుబాటులో ఉంచారు. స్టాక్​ అందుబాటులోకి వచ్చిన రోజే రైతులకు పంపిణీ చేసేవిధంగా అధికారులు చూస్తారు. 

సబ్ సెంటర్ల ఏర్పాటు ద్వారా..

ప్రస్తుత వానాకాలం సీజన్​లో పాలేరు సెగ్మెంట్ పరిధిలో 11,838.09 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు 5,070.34 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశారు. మరో 29.94 మెట్రిక్ టన్నులు స్టాక్​ఉంది. దీనికి అదనంగా కొత్తగా వచ్చిన యూరియాను కూడా రైతులకు పంపిణీ చేస్తారు.  

పీఏసీఎస్​లను విభజించి సబ్​సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా చిన్న రైతులకు కూడా యూరియా సక్రమంగా అందే చాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా బ్లాక్​మార్కెట్ కు కూడా అడ్డుకట్ట పడుతుందని పేర్కొంటున్నారు.

బ్లాక్​ మార్కెటింగ్ ను అరికడతాం.. 

యూరియా స్టాక్​ వచ్చిన రోజే వివిధ శాఖల ప్రభుత్వ సిబ్బందిని నియమించి రైతులకు సక్రమంగా పంపిణీ చేస్తాం. బ్లాక్​ మార్కెట్ కు యూరియా తరలకుండా అరికడతాం. ప్రైవేట్ వ్యక్తుల జోక్యాన్ని నివారిస్తాం. జిల్లాలో 16  పీఏసీఎస్​ల  పరిధిలో 34 సబ్ సెంటర్లను ఏర్పాటు చేశామని ఖమ్మం కలెక్టర్​  అనుదీప్​ దురిశెట్టి తెలిపారు. 

చిన్న రైతులకు ప్రాధాన్యత ఇస్తాం 

యూరియా కోసం రైతులు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. ముందుగా చిన్న రైతులను ఆదుకునేందుకు పీఏసీఎస్​లను విభజించి సబ్​సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. ముందే​పెద్ద రైతులు యూరియా తీసుకుంటే మళ్లీ రాకుండా చర్యలు తీసుకుంటాం. చిన్న రైతులకు సహకరించాలని అవగాహన కల్పిస్తాం. నానో యూరియా వినియోగం పెంచేలా చూడాలని అధికారులను ఆదేశించాం. బ్లాక్​ మార్కెట్ కు ఎవరైనా యూరియా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి  పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అన్నారు.