అమ్మాయిలకు న్యూట్రిషన్ ఫుడ్ .. ఇందిరమ్మ అమృతం పేరుతో కొత్త స్కీమ్

అమ్మాయిలకు న్యూట్రిషన్ ఫుడ్ .. ఇందిరమ్మ అమృతం పేరుతో కొత్త స్కీమ్
  • మ్మాయిలకు న్యూట్రిషన్ ఫుడ్ .. ఇందిరమ్మ అమృతం పేరుతో కొత్త స్కీమ్
  • నేడు కొత్తగూడెంలో ప్రారంభించనున్న మంత్రి సీతక్క
  • ఒక్కో అమ్మాయికి రోజుకో చిక్కీ ప్యాకెట్
  • అంగన్​వాడీ కేంద్రాల ద్వారా సరఫరా
  • తొలుత 3 జిల్లాల్లో అమలుకు నిర్ణయం

హైదరాబాద్, వెలుగు:  అమ్మాయిలకు రాష్ట్ర ప్రభుత్వం న్యూట్రీషన్ ఫుడ్ అందించనున్నది. ‘ఇందిరమ్మ అమృతం’ పేరుతో ఆడపిల్లలకు శక్తినిద్దాం.. ఆరోగ్య తెలంగాణ నిర్మిద్దాం అనే నినాదంతో ఈ స్కీమ్ ను గురువారం కొత్తగూడెం జిల్లాలో మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో 14 నుంచి 18 ఏండ్ల అమ్మాయిలకు పల్లి, చిరుధాన్యాలతో తయారైన చిక్కీలను నెలకు 30 చొప్పున ఫ్రీగా అంగన్ వాడీల ద్వారా పంపిణీ చేయనున్నారు. ఒక్కో చిక్కిలో సుమారు 600 కేలరీలు, 18–20 గ్రాముల ప్రోటీన్లతో పాటు అవసరమైన  మైక్రో న్యూట్రియెంట్స్ ఉంటాయి.

15 చిక్కీల చొప్పున.. నెలకు 2 సార్లు అంగన్‌‌‌‌వాడీ కేంద్రాల ద్వారా ఈ ప్యాకెట్లు పంపిణీ చేయనున్నారు. తొలిదశలో కుమ్రంభీం ఆసిఫాబాద్, కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల్లో ఈ స్కీమ్ అమలు చేస్తారు. 14 నుంచి 18 ఏండ్ల మధ్య 50,269 మంది అమ్మాయిలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 23,399 మంది, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 18,230 మంది, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 8,640 మంది అమ్మాయిలు ఉన్నారు.

రాష్ట్రంలో 64.7 శాతం రక్తహీనత

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 ప్రకారం.. తెలంగాణలో 64.7% మంది బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మహిళా, స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ ‘ఇందిరమ్మ అమృతం’ పథకాన్ని రూపొందించింది. బాలికల ఆరోగ్య స్థితిని అంచనా వేసేందుకు హెచ్ బీ పరీక్షలు నిర్వహించి ఆరోగ్య శాఖ ద్వారా ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు అందిస్తారు. దీంతో పాటు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ- (సెర్ప్) సహకారంతో బాలికల జీవన నైపుణ్యాలను అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేపడ్తారు.

రక్తహీనతను ప్రాథమిక దశలోనే గుర్తించాలి: మంత్రి సీతక్క

ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో భాగంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్‌‌‌‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందజేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. ‘‘మారుతున్న ఆహార అలవాట్లు, జీవన శైలిలో వస్తున్న మార్పులు, ఇతర ఆరోగ్యకారణాల వల్ల ఎంతో మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఈ సమస్యను ప్రాథమిక దశలోనే గుర్తించి చర్యలు తీసుకోవడం ఎంతో కీలకం. అందుకే టీనేజ్ దశ నుంచే రక్తహీనతను తగ్గించేందుకు ‘ఇందిరమ్మ అమృతం’ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. రక్తహీనత శాతం ఎక్కువగా నమోదైన 3 జిల్లాల్లో ముందుగా అమలు చేస్తున్నాం’’అని సీతక్క అన్నారు.