నకిలీ విత్తనాలకు చెక్ .. క్వాలిటీ సీడ్స్ పంపిణీకి సర్కార్ రెడీ

నకిలీ విత్తనాలకు చెక్ ..  క్వాలిటీ సీడ్స్ పంపిణీకి సర్కార్ రెడీ
  • ఒక్కో పంచాయతీలో ముగ్గురికి ఫ్రీగా విత్తనాలు
  • రైతులు ఉత్పత్తి చేసిన విత్తనాలను తిరిగి మార్కెట్లోకి..
  •  యాదాద్రి జిల్లాలో 1,284 మంది

యాదాద్రి, వెలుగు : నకిలీ విత్తనాలకు చెక్​ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కొందరు రైతుల ద్వారా నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేసి మార్కెట్లోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటోంది. ఈ సందర్భంగా ప్రతి గ్రామం నుంచి ముగ్గురు రైతులను ఎంపిక చేసి వారికి నాణ్యమైన విత్తనాలను ఫ్రీగా పంపిణీ చేయనుంది. ఆ రైతులు ఉత్పత్తి చేసిన విత్తనాలను తిరిగి మార్కెట్​లోకి తేనున్నారు. దీంతో మిగతా రైతులందరికీ నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి వస్తాయి. విత్తన మహోత్సవం పేరుతో జూన్​2న ఈ కార్యక్రమాన్ని  సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. జూన్​ 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన రైతులకు విత్తనాలు పంపిణీ
 చేయనున్నారు.  

నకిలీకి చెక్​ పెట్టేలా.. 

సాగు సీజన్​ప్రారంభమైందంటే చాలు.. వేర్వేరు పేర్లతో రంగురంగుల ప్యాకెట్లలో నకిలీ లేదా నాసిరకమైన విత్తనాలు మార్కెట్లకు వచ్చేస్తాయి. ఈ విత్తనాలను ఉపయోగించిన రైతులు పంట దిగుబడి తగ్గడంతో నష్టాల పాలవుతున్నారు. దీన్ని అరికట్టడానికే ప్రొఫెసర్​ జయశంకర్​ వ్యవసాయ విశ్వవిద్యాలయం నాణ్యమైన కొత్తరకం విత్తనాలు ఎప్పటికప్పుడు రూపొందిస్తోంది. కొందరు రైతుల ద్వారా విత్తనాలను ఉత్పత్తి చేసి మార్కెట్లోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనాలను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

 గ్రామానికి ముగ్గురు రైతులు..

ఒక్కో పంచాయతీలో ఓసీ, బీసీ, ఎస్సీ లేదా ఎస్టీ వర్గాల నుంచి ముగ్గురు రైతులను ఏఈవోలు ఎంపిక చేస్తున్నారు. ఎంపిక చేసిన ఈ రైతులకు క్వాలిటీ విత్తనాలను ఫ్రీ అందిస్తారు. అయితే రాష్ట్రంలో అంతటా కామన్​గా వరిని పండిస్తున్నారు. ఒక్కో చోట ఒక్కో రకమైన పంటలు పండిస్తున్నారు. దీనికి అనుగుణంగా ప్రణాళికను రూపొందించారు. ఎంపిక చేసిన రైతుల్లో వరి పండించే వారికి వరి విత్తనాలు, ఇతర పంటలు సాగు చేసే వారికి ఆ రకమైన విత్తనాలను అందించనున్నారు. రైతులు సాగు చేసిన నాణ్యమైన విత్తనాలను అందరికీ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోనున్నారు.  

ఎంపిక చేసిన పంటలు, విత్తన రకాలు..

ఒక్కో జిల్లాలో ఒక్కో రకమైన పంటలను పండిస్తున్నందున పంటల రకాలను అదే విధంగా ఎంపిక చేశారు. వరిలో వివిధ రకాలకు చెందిన విత్తనాలను ఒక్కో రైతుకు 10 కిలోల చొప్పున అందించనున్నారు. ఇతర పంటల విత్తనాలను ఒక్కో రైతుకు 2 కిలోల చొప్పున అందిస్తారు. మొక్కజొన్న విత్తనాలను కామారెడ్డిలో పంపిణీ చేయనున్నారు. కంది విత్తనాలను వికారాబాద్, హన్మకొండ, సంగారెడ్డి, నిర్మల్​జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు. పెసర విత్తనాలను యాదాద్రి, నిజామాబాద్, ఆదిలాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి, జాగిత్యాల, మెదక్​, భద్రాద్రి కొత్తగూడెం, జనగామ జిల్లాలోని రైతులకు అందించనున్నారు. నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేయడానికి రైతులను ఎంపిక చేశారు. యాదాద్రి జిల్లాలోని 428 పంచాయతీలు ఉన్నాయి. ఒక్కో పంచాయతీలో ముగ్గురు చొప్పున 1284 మందిని గుర్తించారు. అయితే వీరందరికీ జూన్ 3 నుంచి విత్తనాలను పంపిణీ చేస్తారు.