
- రాష్ట్రంలో సెమికండక్టర్ ట్యాలెంట్ పెంచేందుకు చర్చలు
హైదరాబాద్, వెలుగు : తెలంగాణలో సెమికండక్టర్ల నిపుణులను పెంచేందుకు తైవాన్ కంపెనీలతో సందీప్ కుమార్ మక్తాల నేతృత్వంలోని టీ–చిప్ (టెక్నాలజీ–చిప్ ఇన్నోవేషన్ ప్రోగ్రాం) ప్రతినిధి బృందం కీలక చర్చలు జరిపింది. ఈ కంపెనీల ప్రతినిధులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఏఆర్ఎం, సినాప్సిస్, టీఎస్ఎంసీ, ఫారాడే టెక్నాలజీ వంటి ప్రముఖ సంస్థలతో టీ–చిప్ సమావేశమయ్యింది.
తెలంగాణను గ్లోబల్ సెమీకండక్టర్ రంగంలో కీలకంగా మార్చడమే లక్ష్యమని తెలిపింది. చిప్ డిజైన్, తయారీ, నైపుణ్య మార్పిడి, సాంకేతిక సహకారం వంటి అంశాలపై తైవాన్ కంపెనీలు, టీ–చిప్ బృందం మధ్య చర్చలు జరిగాయి. ఏఆర్ఎం తైవాన్తో విద్య, పరిశోధన, స్టార్టప్ రంగాల అనుసంధానంపై, సినాప్సిస్తో చిప్ శిక్షణ, ఇంక్యూబేటర్ సాయం వంటి అంశాలపై చర్చ జరిగింది.
టీఎస్ఎంసీ సందర్శనలో స్టూడెంట్ ఎక్స్చేంజ్పై చర్చించగా, ఫారాడే సంస్థలో సెక్యూరిటీ ఆఫరేషన్ సెంటర్స్ (ఎస్ఓసీ) శిక్షణ, ఇన్నోవేషన్స్పై చర్చలు జరిగాయి. స్ప్రింగ్ సెమీకండక్టర్ సీఈఓ కెన్ ఖూ, డబ్ల్యూటీఐటీసీ ఏసియన్ అధ్యక్షుడు మారుతి కుర్మా ఈ చర్చల్లో పాల్గొన్నారు. తెలంగాణలో చిప్ ట్యాలెంట్ను పెంచడంలో ఈ చర్చలు సాయపడతాయని అని సందీప్ మక్తాల అన్నారు.