- హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహ
అల్లాదుర్గం, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తోందని హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహ అన్నారు. శనివారం మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్, పెద్ద శంకరంపేట మండలాల 220 మంది అంగన్వాడీ టీచర్లకు జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్తో కలిసి స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంగన్వాడీల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
గర్భిణులు, బాలింతలు, పసిపిల్లలకు పోషకాహారం, ప్రాథమిక విద్య, టీకాలు, ఆరోగ్య పరీక్షలు వంటి సేవలను అంగన్వాడీల ద్వారా అందిస్తున్నామని తెలిపారు. ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ కొప్పుల లక్ష్మీశేషారెడ్డి, ఆర్డీవో రమాదేవి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి హేమ భార్గవి, సీడీపీవో పద్మలత పాల్గొన్నారు.
