
- ఎన్నికల ఏడాదిలోనే హడావుడిగా 14 కాలేజీలు శాంక్షన్
- ఒక్క కాలేజీకీ పోస్టులు మంజూరు చేయని గత సర్కారు
- గెస్టు లెక్చరర్లు, ఓడీలతో నడుస్తున్న కాలేజీలు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మంజూరైన సర్కారు జూనియర్ కాలేజీలు సార్లు లేక వెలవెలబోతున్నాయి. గత బీఆర్ఎస్ సర్కారు.. మొత్తం 16 కాలేజీలు శాంక్షన్ చేసింది. తన పాలన చివరి ఏడాదిలోనే ఏకంగా 14 కాలేజీలు మంజూరు చేసింది. ఎన్నికలకు రెండు నెలల ముందు కూడా రెండు కాలేజీల ఏర్పాటుకు జీవోలిచ్చింది.
ఎంతో ఆర్భాటంగా కాలేజీలను మంజూరు చేసినప్పటికీ.. అందులో ఒక్క కాలేజీకి కూడా పోస్టులు మంజూరు చేయలేదు. దీంతో లెక్చరర్, ఇతర పోస్టులు శాంక్షన్ లేకపోవడంతో.. ఆయా కాలేజీల్లో అడ్మిషన్లు అంతంత మాత్రంగానే నడుస్తున్నాయి. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు కాలేజీలకు శాంక్షన్ ఇవ్వగా.. పోస్టులూ మంజూరు చేయడం గమనార్హం.
దిగిపోయే ముందు కాలేజీలు శాంక్షన్
రాష్ట్రంలో 430 సర్కారు జూనియర్ కాలేజీలు ఉన్నాయి. లక్షన్నర మంది విద్యార్థులు వాటిలో చదువుతున్నారు. వీటిలో సుమారు 5 వేల మంది లెక్చరర్లు పనిచేస్తున్నారు. అయితే, ఉమ్మడి రాష్ట్రం నుంచే మండలానికొక జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు, విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి వినతులు సమర్పించాయి.
అయినా, అప్పటి బీఆర్ఎస్ సర్కారు పెద్దగా పట్టించుకోలేదు. తొలి ఐదేండ్లలో ఒక్క కాలేజీనీ ఏర్పాటు చేయలేదు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సర్కారు మీద వ్యతిరేకత మొదలవడంతో.. కాలేజీల ఏర్పాటుపై నివేదికలు తెప్పించుకున్నది. ఈ క్రమంలో వివిధ జిల్లాల్లో మొత్తం16 జూనియర్ కాలేజీలకు శాంక్షన్ ఇచ్చింది. 2023 నవంబర్ లో అసెంబ్లీకి ఎన్నికలు జరగ్గా.. సరిగ్గా నాలుగు నెలల ముందు 14 కాలేజీలను మంజూరు చేసింది. దీంట్లో సెప్టెంబర్ లో మూడు శాంక్షన్ చేయగా, అక్టోబర్లోనూ ఓ కాలేజీ సాంక్షన్ చేసింది.
ఓడీలపై వచ్చి క్లాసులు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొత్తం 21 కాలేజీలు మంజూరు కాగా.. దీంట్లో 16 కాలేజీల్లో ఒక్క పోస్టు శాంక్షన్ కాలేదు. కాంగ్రెస్ హయాంలో ఏర్పాటైన ఐదు కొత్త కాలేజీల్లో పోస్టులు శాంక్షన్ అయినా.. ఇంకా వాటిని భర్తీ చేయలేదు. అయితే, ఆయా కాలేజీలకు దగ్గరలోని కాలేజీల ప్రిన్సిపాల్స్, సీనియర్ లెక్చరర్లకు ఇన్చార్జ్ ప్రిన్సిపాల్స్ గా బాధ్యతలు అప్పగించారు. ఇటీవల సర్కారు నియమించిన కొత్త జూనియర్ లెక్చరర్లు, గెస్టు లెక్చరర్లను ఓడీలపై అక్కడికి పంపించి వచ్చిన పిల్లలకు పాఠాలు చెప్పిస్తున్నారు.
కొన్ని చోట్ల వేర్వేరు కాలేజీల నుంచి రెండు, మూడు రోజులకోసారి లెక్చరర్లను పంపించి గతంలో క్లాసులు చెప్పించారు. ఇప్పుడూ అదే విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది. కొత్త కాలేజీల్లో పోస్టులే మంజూరు కాకపోవడంతో విద్యార్థులు అడ్మిషన్లు తీసుకొని మళ్లీ క్యాన్సిల్ చేసుకొని వెళ్లిపోతున్నారు.
కొత్త పోస్టుల కోసం నివేదిక..
ప్రస్తుతం కొత్తగా ఏర్పాటైన 17 కాలేజీలకు ప్రిన్సిపాల్స్, లెక్చరర్లతో పాటు నాన్ టీచింగ్ సిబ్బంది కోసం ఇంటర్ కమిషనరేట్ అధికారులు సర్కారుకు ప్రతిపాదనలు పంపించారు. మొత్తం17 ప్రిన్సిపాల్ పోస్టులతో పాటు 14 కాలేజీలకు 12 మంది లెక్చరర్ల చొప్పున 168 మంది, మూడు కాలేజీల్లో 11 మంది లెక్చరర్ల చెప్పున 33 మంది అవసరమని సర్కారుకు నివేదించారు. ఈ లెక్కన జనరల్ కోర్సుల్లో 301 మంది, ఒకేషనల్ కోర్సుల కోసం 32 మంది కావాలని కోరారు. ప్రతి కాలేజీకి పీడీ, లైబ్రేరియన్ తో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్, రికార్డు అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్లు, ఇద్దరు ఆఫీస్ సబార్డినేట్లు, నైట్ వాచ్ మెన్, స్వీపర్, స్కావెంజర్ పోస్టులను శాంక్షన్ చేయాలని ప్రతిపాదనలు పంపించారు.
కొత్తగా మంజూరు చేసిన కాలేజీలు ఇవే..
గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో కామారెడ్డి జిల్లాలో 2021-–22లో బీర్కూర్, బీబీపేట, నిజాంసాగర్, 2023–24లో నాగిరెడ్డిపేటకు మంజూరు చేశారు. అలాగే, 2022-–23లో రంగారెడ్డి జిల్లాలో మీర్ పేట, నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి, ఖమ్మం జిల్లా కందుకూరు, వికారాబాద్ లోని దౌల్తాబాద్, బషీరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో చిన్నచింతకుంట, నిర్మల్ జిల్లా కుంటాల, మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్, నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి, నాగర్ కర్నూల్ జిల్లాలో పెద్దకొత్తపల్లిలో, 2023–-24లో ములుగు జిల్లా వెంకటాపురంలో ఏర్పాటు చేశారు.