
- రాష్ట్ర వ్యాప్తంగా 602 స్కూళ్లకు పక్కా బిల్డింగ్స్
- ఆరు పాత స్కూళ్ల రిపేర్లకు స్పెషల్ ఫండ్స్
- స్టడీ మెటీరియల్స్ పంపిణీపై కలెక్టర్ చొరవ
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : దివ్యాంగులైన చిన్నారుల చదువులకు పునాదులు వేస్తున్న భవిత స్కూళ్లకు మంచి భవిష్యత్ రానుంది. గత పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం భవిత స్కూళ్లను పట్టించుకోలేదు. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి భవిత స్కూళ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా భవిత స్కూల్స్కు పక్కా భవనాలు నిర్మించేందుకు ఫండ్స్ రిలీజ్ చేశారు. గతంలో ఉన్న పక్కా బిల్డింగుల రిపేర్ల కోసం ఫండ్స్ సాంక్షన్ చేశారు.
ఇన్నాళ్లు కనీస సౌకర్యాలు కరువు..
దివ్యాంగులైన చిన్నారుల కోసం 15 ఏళ్ల కింద ఏర్పాటు చేసిన భవిత స్కూళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించలేదు. సరైన స్కూల్ బిల్డింగ్లు లేకపోవడంతో గవర్నమెంట్ స్కూల్స్లలోని వరండాల్లో, ఇతర ఇరకు గదుల్లో కాలం వెళ్ల దీస్తూ వచ్చారు. కనీసం వారికి టాయిలెట్స్ లేకపోవడంతో స్కూల్కు వచ్చేందుకు దివ్యాంగ స్టూడెంట్స్ఇంట్రస్ట్ చూపలేదు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ స్కూళ్లపై, దివ్యాంగుల చదువులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. భవిత సెంటర్లపై నివేదికలు తెప్పించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 602 భవిత స్కూల్స్కు ఫండ్స్ రిలీజ్ చేశారు. ఒక్కో స్కూల్కు స్పెషల్ టాయిలెట్లతో కలిపి రూ. 8లక్షల చొప్పున నిధులు రిలీజ్ చేస్తూ వారం రోజుల కిందట ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం భవిత స్కూల్స్ కు పక్కా బిల్డింగ్లు ఉన్న వాటికి రిపేర్ల కోసం రూ. 1.50లక్షల చొప్పున ప్రభుత్వం విడుదల చేసింది.
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 17 స్కూళ్లు
జిల్లా వ్యాప్తంగా 23 మండలాలున్నాయి. ఒక్కో మండలానికి ఒక్కో భవిత స్కూల్ను ప్రభుత్వం సాంక్షన్ చేసింది. ఈ స్కూల్తో పాటు గవర్నమెంట్ స్కూళ్లలో 2,425 మంది దివ్యాంగ చిన్నారులు విద్యనభ్యసిస్తున్నారు. కాగా జిల్లాలో ఆరు చోట్ల మాత్రమే భవిత స్కూల్స్ కు పక్కా బిల్డింగ్లున్నాయి. కానీ వీటిలో టాయ్లైట్లు సరిగా లేవు. కొన్ని చోట్ల బిల్డింగ్లు శిథిలావస్థకు చేరాయి. పాత బిల్డింగ్లకు రిపేర్లు, టాయ్ లెట్లకు ఒక్కో స్కూల్కు రూ. 1.50లక్షల చొప్పున ప్రభుత్వం ఫండ్స్ ఇచ్చింది. అంతేకాకుండా ప్రస్తుతం గవర్నమెంట్ స్కూళ్లలో అరకొర సౌకర్యాల మధ్య కొనసాగుతున్న 17 మండలాలకు గానూ 17 పక్కా బిల్డింగ్లను నిర్మించేందుకు ప్రభుత్వం ఒక్కో స్కూల్ బిల్డింగ్కు రూ. 7లక్షలు, టాయిలెట్ల కోసం రూ. లక్ష చొప్పున నిధులు మంజూరు చేసింది. దీంతో దివ్యాంగుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కలెక్టర్ ప్రత్యేక చొరవ..
జిల్లాలోని దివ్యాంగ స్కూల్స్పై కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఇటీవల కొత్తగూడెం పట్టణం రైటర్ బస్తీలోని భవిత స్కూల్ను ఆయన సందర్శించారు. అవసరమైన ఫర్నీచర్తో పాటు స్టూడెంట్స్కు అవసరమైన స్టడీ మెటీరియల్కు ఫండ్స్ ఇస్తానని ప్రకటించారు. దివ్యాంగ స్టూడెంట్స్కు ఏమేమి అవసరమో నివేదికలు ఇవ్వాలని కో ఆర్డినేటర్ను ఆదేశించారు.
ఇక దివ్యాంగ స్టూడెంట్స్కు మంచి భవిష్యత్
ఇప్పటి వరకు అరకొర సౌకర్యాల మధ్యనే దివ్యాంగ స్టూడెంట్స్ చదవులు కొనసాగించారు. ఇక దివ్యాంగ స్టూడెంట్స్కు మంచి భవిష్యత్ రానుంది.ప్రభుత్వం ప్రత్యేకంగా భవిత స్కూళ్ల కోసం పక్కా బిల్డింగ్ల నిర్మాణాలు చేపట్టడం హర్షనీయం. ఇప్పటికే జిల్లాలోని వందల సంఖ్యలో స్టూడెంట్స్కు కావాల్సిన పరికరాలను పంపిణీ చేశాం. – సైదులు, భవిత సెంటర్స్ జిల్లా కో ఆర్డినేటర్, భద్రాద్రికొత్తగూడెం