
- మల్లన్నసాగర్ నిర్వాసితులకు ప్రభుత్వం ఇస్తున్న పరిహారమిది
- మార్కెట్ రేటులో పదో వంతూ ఇస్తలే
- డిస్ట్రిబ్యూటరీ కాలువ నిర్మిస్తున్న గ్రామాల్లో వంద మందికి పైగా రైతుల గోస
- డ్రిప్, బోరు, పైప్ లైన్ల పరిహారానికి నోరైతులు వ్యతిరేకించడంతో వారికి
- తెలియకుండానే అలైన్మెంట్ ఖరారు
- పరిహారం చెక్కులు తీసుకునేందుకు నిరాకరిస్తున్న రైతులు
సిద్దిపేట, వెలుగు:‘‘ఇయ్యాల తెలంగాణలో భూములు బంగారమైనయి.. ఏ మారుమూల ప్రాంతానికి పోయినా ఎకరానికి 30, 40 లక్షలకు తక్కువ లేదు...” సీఎం కేసీఆర్ అనేక సభల్లో చెప్పిన మాట ఇది! నిజానికి రాష్ట్రంలో వ్యవసాయ భూములు ఎకరాకు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల దాకా పలుకుతున్నాయి. స్టేట్, నేషనల్ హైవేల వెంబడి అయితే ఎకరం రూ.కోటికి తక్కువ లేదు. తాము చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు, వ్యవసాయానికి ఉచిత కరెంట్, రైతుబంధు లాంటి ప్రోత్సాహకాల వల్లే భూముల రేట్లు పెరిగాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ అదే సర్కారు.. వివిధ ప్రాజెక్టులు, కాల్వల కోసం రైతుల నుంచి సేకరిస్తున్న భూములకు మాత్రం మార్కెట్ రేటులో కనీసం పదో వంతు కూడా ఇవ్వడం లేదు. కాళేశ్వరం సహా వివిధ ప్రాజెక్టుల కింద లక్ష ఎకరాల వరకు భూములు సేకరించినా.. రైతులకు సగటున ఎకరాకు రూ.5 లక్షలకు మించి ఇవ్వలేదు. తాజాగా సిద్దిపేట జిల్లా తొగుట మండలం కాన్గల్ గ్రామంలో మల్లన్న సాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నిర్మాణానికి సేకరిస్తున్న భూములకు అతి తక్కువగా ఎకరాకు రూ.1.90 లక్షలు ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన పరిహారపు చెక్కులను పంపిణీ చేసేందుకు అధికారులు ప్రయత్నించగా.. రైతులు వాటిని తీసుకోకుండా నిరసన తెలుపుతున్నారు.
మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి దుబ్బాకకు నీటిని తరలించే మెయిన్ కెనాల్ నుంచి తొగుట మండలం ఎల్లారెడ్డిపేట, కాన్గల్ పెద్ద చెరువు మీదు గా లింగంపేట పటేల్ చెరువు వరకు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నిర్మిస్తున్నారు. దాదాపు నాలుగు ఊర్ల మీదు గా 5.35 కి. మీ పొడవుతో నిర్మించే డిస్ర్టిబ్యూటరీ కెనాల్ కోసం ఇరిగేషన్ అధికారులు భూసేకరణ చేపట్టారు. 20 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్న కెనాల్ కోసం ఎల్లారెడ్డిపేటలో 18 ఎకరాలు, కాన్గల్లో 11.20 ఎకరాలు, తొగుటలో 37 గుంటలు, లిం గంపేటలో 25 గుంటల భూమిని సేకరించింది. 4 గ్రామాల పరిధిలోని 150 మంది రైతులకు సం బంధించి దాదాపు 32 ఎకరాలు సేకరించిన అధికారులు.. 2013 చట్టం ప్రకారమంటూ ఎకరానికి రూ.1.90 లక్షల పరిహారాన్ని ఖరారు చేశారు. ఇటీవల కాన్గల్ గ్రామంలోని 43 మంది రైతులకు ఎకరా 1.90 లక్షల చొప్పున పరిహారాల చెక్కులను తీసుకుని వెళ్లారు. తమ విలువైన భూములకు తక్కువ పరిహారాలు ఎలా ఇస్తారని ఆగ్రహిస్తూ రైతులు ఇరిగేషన్ అధికారులను గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి నిరసన తెలిపారు.
రైతులకు సమాచారం ఇవ్వకుండానే అలైన్మెంట్
కాన్గల్ గ్రామంలో కెనాల్ నిర్మాణం విషయంలో అధికారులు రైతులకు సరైన సమాచారం ఇవ్వకుండానే అలైన్మెంట్ పూర్తి చేశారు. కొద్ది నెలల క్రితం సర్వే కోసం వచ్చిన ఇరిగేషన్ అధికారులను.. తమకు న్యాయమైన పరిహారం ఇస్తేనే భూములిస్తామని రైతులు స్పష్టం చేసి వెనక్కి పంపారు. దీంతో రైతులకు తెలియకుండానే డిస్ట్రిబ్యూటరీ కెనాల్ అలైన్మెంట్ను ఆఫీసర్లు ఖరారు చేసి పరిహారాల చెక్కులను సిద్ధం చేశారు. కాన్గల్ గ్రామంలోని 43 మంది రైతులకు సంబంధించిన 11 ఎకరాలను అధికారులు సేకరించారు. ఇందులో 7 ఎకరాలు పట్టా భూమి కాగా.. 5 ఎకరాలు అసైన్డ్ భూములన్నాయి. అసైన్డ్, పట్టా భూములకు ఒకే రకమైన పరిహారాలను ఆఫీసర్లు నిర్ణయించారు. ఆయా భూముల్లో రైతులకు సంబంధించిన నిర్మాణాలు, బోరు, డ్రిప్, పైప్ లైన్, బావులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని మాత్రం పట్టించుకోలేదు. కాన్గల్ గ్రామానికి ఆనుకుని ఉన్న తుక్కాపూర్లో థర్డ్ టీఎంసీ కాలువ కోసం సేకరించిన భూమికి ఎకరాకు 13 లక్షలు, మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో ఎకరాకు రూ.6 లక్షల నుంచి 8 లక్షల వరకు పరిహారం చెల్లించిన విషయాన్ని బాధిత రైతులు గుర్తు చేస్తున్నారు. వీటికి కూత వేటు దూరంలో ఉన్న కాన్గల్ గ్రామంలో మాత్రం అతి తక్కువ ధర కట్టడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
మార్కెట్ రేటు 40 లక్షలు
కాన్గల్ గ్రామంలోని వ్యవసాయ భూముల ధరలు బహిరంగ మార్కెట్లో ఎకరాకు దాదా పు రూ.40 లక్షల పై చిలుకు పలుకుతున్నాయి. మల్లన్న సాగర్ రిజర్వాయర్కు అతి దగ్గర్లోనే కాన్గల్ గ్రామం ఉండటంతో నీటి సౌలత్ బాగా ఉంది. దీంతో ఇక్కడి సాగు భూములకు మంచి ధరలు లభిస్తున్నాయి. కాన్గల్ పెద్ద చెరువు నుంచి లింగంపేట పటేల్ చెరువు దాకా వరద కాలువ ఉండగా ప్రత్యేకంగా మరో డిస్ట్రిబ్యూటరీ కెనాల్ అవసరమే లేదని రైతులు చెబుతున్నారు. సహజ సిద్ధమైన వరద కాలువ ఉండగా మరో కెనాల్ను నిర్మించి రైతులను అన్యాయం చేయడం తగదని వాపోతున్నారు.
విలువైన భూములు కోల్పోతున్నం
డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నిర్మాణం కోసం విలువైన భూములను సేకరించి తక్కువ పరిహారాలు చెల్లిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.40 లక్షలు పలుకుతున్న భూములకు అతి తక్కువగా రూ.1.90 లక్షల పరిహారం నిర్ణయించడం మాకు అన్యాయం చేయడమే.
- ఎం.భాపురెడ్డి, రైతు, కాన్గల్
అన్యాయం చేస్తున్నరు
భూములకే పరిహారాలు లెక్కిస్తున్న అధికారులు.. పొలాల్లోని నిర్మాణాలను లెక్కలోకి తీసుకోవడం లేదు. భూసేకరణ భూముల్లో డ్రిప్, బోరు, పైప్ లైన్ లున్నా వాటికి పరిహారం ఇవ్వడం లేదు. తక్కువ పరిహారాన్ని నిర్ధారించి అన్యాయం చేస్తున్నరు. స్ట్రక్చర్స్కు పరిహారం ఇవ్వక పోవడం బాధాకరం.
- ఎం. శ్రీనివాసరెడ్డి, రైతు
బోర్లు, బావులకూ పరిహారమివ్వాలి
డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదు. కానీ విలువైన భూములు కోల్పోతున్నాం. పరిహారాన్ని పెంచాల్సిందే. నిర్మాణాలు, డ్రిప్, బోర్లు, బావులకూ పరిహారం ఇవ్వాలి.
- ఎం.రమణారెడ్డి, రైతు
మాకు తెలియకుండానే సర్వే
కెనాల్ కోసం రైతులకు తెలియకుండానే అధికారులు సర్వే నిర్వహించి అలైన్ మెంట్ ఖరారు చేశారు. గతంలో సర్వే కోసం వచ్చినప్పుడు గ్రామ రైతులు అడ్డుకుని న్యాయమైన పరిహారం ఇస్తేనే భూములిస్తామని స్పష్టం చేశారు. కానీ అధికారులు పట్టించుకోకుండా అలైన్ మెంట్ ఖరారు చేసి.. ఇప్పుడు పరిహారాల చెక్కులు ఇస్తామనడం అన్యాయం.
- ఎం.భాస్కర్ రెడ్డి, రైతు కాన్గల్