
- పోలీసు శాఖలో 9 మంది గ్రేహౌండ్స్ సిబ్బందికి,
- ఫైర్ సర్వీసెస్లో ఇద్దరికి శౌర్య పతకం
- అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం పోలీసులకు పతకాలను ప్రకటించింది. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్, ఫైర్ సర్వీసెస్ సహా హోం శాఖలోని వివిధ విభాగాలకు చెందిన మొత్తం 625 మందిని పతకాలకు ఎంపిక చేసింది. ప్రతిష్టాత్మకమై శౌర్యపతకం, మహోన్నత సేవా పతకం, ఉత్తమ సేవ, కఠిన సేవ, సేవా పతకాలకు కేటగిరి వారీగా ప్రకటించింది. ఈ మేరకు పతకాల విజేతల పేర్లను హోం శాఖ ప్రత్యే క ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఆదివారం విడుదల చేశారు. ఇందులో రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాత్మకమైన తెలంగాణ పోలీస్ శౌర్య పతకం తొమ్మిది మంది గ్రేహౌండ్స్ సిబ్బందికి దక్కింది. గ్రేహౌండ్స్ ఆర్ఎస్సైలు సీహెచ్ మహేశ్, జి.శోభన్, ఎ.రాకేశ్ కుమార్, కానిస్టేబుళ్లు జి.వెంకటేశ్, కె.రమేశ్, ఎం.పాపియా నాయక్, ఎం.రవీందర్ సంజయ్, జె.నరేశ్, టి.వెంకటేశ్ను ఎంపిక చేశారు. ఫైర్ సర్వీసెస్లో ఇద్దకి శౌర్య పతకాలు దక్కాయి.
హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ టి.వెంకన్న, సాలార్ జంగ్ మ్యూజియం ఫైర్ స్టేషన్ లీడింగ్ ఫైర్మ్యాన్ మిరాజ్ కరమతుల్లాకు తెలంగాణ ఫైర్ సర్వీసెస్ శౌర్య పతకాలు దక్కాయి. మహోన్నత సేవా పతకం ఫైర్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ టి.మహేందర్ రెడ్డికి దక్కగా ఉత్తమ సేవా పతకానికి ముగ్గురు ఎంపికయ్యారు. అలాగే సేవా పతకానికి 14 మంది ఎంపికయ్యారు. శౌర్య పతకం దక్కిన వారికి ప్రతినెలా రూ.500తో పాటు ఒకేసారి రూ.10 వేల నగదు పురస్కారం అందిస్తారు. అదేవిధంగా మహోన్నత సేవా పతకం దక్కిన వారికి రూ.40 వేల నగదు పురస్కారం, ఉత్తమ సేవా పతకం దక్కిన వారికి రూ.30 వేల నగదు పురస్కారం, కఠిన సేవా పతకానికి ఎంపికైన వారికి రూ.20 వేల నగదు పురస్కారం, సేవా పతకానికి సెలెక్ట్ అయిన వారికి రూ.20 వేల నగదు పురస్కారం అందజేయనున్నారు.