సుప్రీం నువ్వా–నేనా : గవర్నర్ పై.. పిటీషన్​ వేసిన ప్రభుత్వం

సుప్రీం నువ్వా–నేనా : గవర్నర్ పై..  పిటీషన్​ వేసిన ప్రభుత్వం

గవర్నర్ తమిళిసై సుప్రీంకోర్టులో రిట్ పిటీషన్ వేసింది తెలంగాణ ప్రభుత్వం. గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపించిన 10 బిల్లులను పెండింగ్ లో పెట్టారని.. ఆమోదించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ.. తెలంగాణ ప్రభుత్వమే సుప్రీంకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేయటం సంచలనంగా మారింది. చీఫ్ సెక్రటరీ ఈ పిటీషన్ ను అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేయటం విశేషం. 

గవర్నర్ తమిళిసై వ్యవహార తీరు బాగోలేదని.. ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించకపోవటాన్ని తప్పుపడుతుంది ప్రభుత్వం.  ఆరు నెలలుగా 10 బిల్లులను ఆమోదించకుండా తొక్కిపెడుతున్నారని వాదిస్తూ.. గవర్నర్ పరిధి ఏంటీ.. ఎందుకు బిల్లులు ఆమోదించటం లేదనే విషయాన్ని సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాలని డిసైడ్ అయ్యింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే పిటీషన్ దాఖలు చేస్తూ.. బిల్లులను గవర్నర్ ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది సర్కార్. ఈ పిటీషన్ మార్చి 3వ తేదీన విచారణకు వచ్చే అవకాశం ఉంది. 


రిట్ పిటీషన్ విచారణతో గవర్నర్ పరిధి ఏంటీ అనే విషయంలో స్పష్టత వస్తుందని.. బీజేపీ పాలనలో గవర్నర్ల తీరును దేశవ్యాప్తంగా తీసుకెళ్లినట్లు అవుతుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఈ ఉద్దేశంతోనే సుప్రీంకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇదే క్రమంలో బీజేపీ వాదన మరోలా ఉంది. రాజ్యంగ పరిధిలో బిల్లులు అంటే.. గవర్నర్ ఆమోదిస్తారని.. రాజ్యాంగ పరిధికి భిన్నంగా ఉంటే బిల్లులను ఎలా ఆమోదిస్తారని ప్రశ్నిస్తుంది బీజేపీ. అధికారం ఉంది కదా అని చట్ట, న్యాయ, ప్రజా వ్యతిరేక బిల్లులను పంపిస్తే.. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన గవర్నర్ ఎలా ఆమోదిస్తారని ఎదురుదాడి చేస్తుంది బీజేపీ. గవర్నర్ రాజ్యాంగానికి లోబడి పని చేస్తారని.. ప్రభుత్వాలు చెప్పినట్లు పని చేయరని అంటోంది బీజేపీ..ఎవరి వాదనలు ఎలా ఉన్నా..  సుప్రీంకోర్టులో విచారణపై ఆసక్తి నెలకొంది..