తెలంగాణలో కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి సారించిన విషయం విదితమే. ఇప్పటికే యూపీఎస్ సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను మార్చే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గత పాలకమండలి సభ్యులు రాజీనామా చేయగా.. వారి స్థానంలో కొత్త సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది.
టీఎస్పీఎస్సీ చైర్మన్ సహా సభ్యుల నియామకానికి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు నమూనా పత్రాలు కమిషన్ అధికారిక వెబ్సైట్ www.telangana.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను 18వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు secy-ser-gad@telangana.gov.inకు మెయిల్ చేయాలి. చైర్మన్, సభ్యుల పదవులకు కావాల్సిన అర్హతలు, ఇతర వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ను సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నియమితులైన ఛైర్మన్ సహా పలువురు సభ్యులు ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వీరి రాజీనామాలకు గవర్నర్ ఆమోదం తెలపటంతో.. ఈ ఖాళీలు ఏర్పడ్డాయి.