మంచిర్యాలలోనూ సర్కారీ లేఅవుట్లు..  అసైన్డ్​ భూములకు ప్రాధాన్యం 

మంచిర్యాలలోనూ సర్కారీ లేఅవుట్లు..  అసైన్డ్​ భూములకు ప్రాధాన్యం 
  •     జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో ఏర్పాటు 
  •     అన్ని వసతులతో వెంచర్ల డెవలప్​మెంట్
  •     ​ ప్రభుత్వ, అసైన్డ్​ భూములకు ప్రాధాన్యం 
  •     యజమానుల అంగీకారంతో పట్టా భూముల్లో సైతం.. 
  •     భూములను గుర్తించే పనిలో రెవెన్యూ అధికారులు

మంచిర్యాల, వెలుగు:  ల్యాండ్​ పూలింగ్ ద్వారా మున్సిపాలిటీల్లోని గవర్నమెంట్, అసైన్డ్​ ల్యాండ్స్​లో లేఅవుట్లు చేసి భారీగా ఆదాయాన్ని రాబట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్​ వేసింది. ఖాళీ అయిన రాష్ర్ట ఖజనాను నింపుకోవడానికి సర్కారు కొత్త దారులు వెతుకుతోంది. ఇప్పటికే పలుచోట్ల రూ. కోట్ల విలువైన  భూములను అమ్మిన ప్రభుత్వం తాజాగా రియల్ ​ఎస్టేట్​ బిజినెస్ లోకి అడుగుపెట్టింది. ప్రభుత్వ, అసైన్డ్​ భూములు దొరకని చోట పట్టా భూములను సేకరించనుంది. బడా రియల్​ఎస్టేట్ సంస్థలకు దీటుగా ఆయా మున్సిపాలిటీల్లో లేఅవుట్లను డెవలప్​ చేసి ప్లాట్లు విక్రయించనుంది. ఇప్పటికే ఆర్డర్స్​ జారీ కావడంతో రెవెన్యూ, మున్సిపల్​అధికారులు భూములను గుర్తించే పనిలో పడ్డారు.  ఆయా మున్సిపాలిటీల్లోని ప్రభుత్వ, అసైన్డ్​ భూముల రికార్డులకు సంబంధించిన ఫైళ్ల దుమ్ము దులుపుతున్నారు.  

20 ఎకరాల్లో లేఅవుట్లు 

మున్సిపాలిటీల్లో 20 ఎకరాలకు ఒక లేఅవుట్​వెంచర్​ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అంత మొత్తంలో గవర్నమెంట్, అసైన్డ్​భూములు లేకుంటే వాటి పక్కనున్న పట్టా భూములను యజమానుల అంగీకారంతో సేకరించనున్నారు. ఎకరం నుంచి నాలుగైదు ఎకరాల బిట్లను కలిపి మొత్తం 20 ఎకరాల్లో, అదీ వీలు కాకుంటే కనీసం10 ఎకరాల్లో లేఅవుట్​చేయనున్నారు. డీటీసీపీ రూల్స్​ప్రకారం 33 ఫీట్ల బ్లాక్​టాప్ రోడ్లు, డ్రైనేజీలు, కరెంట్​ లైన్లు, వాటర్​సప్లై, అవెన్యూ ప్లాంటేషన్​ వంటి మౌలిక వసతులను అభివృద్ధి చేస్తారు. సామాజిక అవసరాల కోసం మొత్తం భూమిలో 10 శాతం కేటాయించి అందులో పార్కులు, ఆలయాలు, స్కూళ్లు, అంగన్​వాడీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. లేఅవుట్ ​డెవలప్​మెంట్​చేసిన తర్వాత 50 శాతం ప్లాట్లను యజమానులకు అప్పగించి, మిగతా 50 శాతం ప్లాట్లను గవర్నమెంట్​అమ్ముకుంటుంది.  భూముల స్వభావాన్ని బట్టి లేఅవుట్  డెవలప్​మెంట్​కు ఎక్కువ మొత్తంలో ఖర్చయినట్లయితే ప్రభుత్వం 60 శాతం తీసుకుని 40 శాతం భూ యజమానులకు అప్పగిస్తుంది. 

అసైన్డ్​దారులకు, కొనుగోలుదారులకు మేలు.. 

మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, చెన్నూర్​, నస్పూర్​, క్యాతన్​పల్లి, లక్సెట్టిపేట మున్సిపాలిటీలు ఉన్నాయి. మంచిర్యాల, నస్పూర్​లో చాలాకాలంగా రియల్​ఎస్టేట్ బిజినెస్ జోరుగా సాగుతోంది.  ఇటీవల కాలంలో మిగతా ఐదు టౌన్లలోనూ రియల్​ బిజినెస్ పుంజుకుంది.  పట్టణ శివారు ప్రాంతాల్లో రోజుకో వెంచర్​ వెలుస్తోంది.  ఎక్కడ చూసినా గజానికి రూ.10 వేల నుంచి రూ.20 వేల దాకా రేటు పలుకుతోంది.  అసైన్డ్​భూములను అమ్ముకోవడానికి చాన్స్​ లేకపోవడంతో యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఇల్లీగల్​గా కొనుగోలు చేసి రియల్​వెంచర్లు చేస్తున్నారు. ప్రభుత్వమే అధికారికంగా లేఅవుట్లు చేస్తుండడంతో అసైన్డ్​దారులకు తిప్పలు తప్పనున్నాయి. డబుల్​ రిజిస్ర్టేషన్ల వంటి రియల్టర్ల మోసాలకు బ్రేక్​ పడే అవకాశం ఉంది. 

అన్ని వసతులతో లేఅవుట్ల అభివృద్ధి

జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో ప్రభుత్వ, అసైన్డ్​భూముల్లో లేఅవుట్లు చేయాలని ఆదేశాలు వచ్చాయి. భూముల గుర్తింపు ప్రక్రియ జరుగుతోంది. యజమానులు ముందుకొస్తే పట్టా భూములను సైతం తీసుకుంటాం. సర్కారీ లేఅవుట్లలో డీటీసీపీ రూల్స్​ప్రకారం అన్ని వసతులను కల్పిస్తాం. అసైన్డ్, పట్టా భూములను లేఅవుట్ల కోసం ఇవ్వదలిచిన వారు సంబంధిత తహసీల్దార్లను సంప్రదించాలి. 

బి.రాహుల్, అడిషనల్ కలెక్టర్​
(లోకల్​బాడీస్)