ఆర్టీసీ బిల్లులపై గవర్నర్ తమిళిసై ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. సమాధానలతో కూడిన లేఖను రాజ్భవన్ కార్యదర్శికి ప్రభుత్వం పంపింది. ఆర్టీసీ ఎంప్లాయీస్ ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన తరువాత వారికి ఇప్పటికన్నా మెరుగైన జీతాలు ఉంటాయని అందులో ఉంది. విలీనం తర్వాత విధివిధానాల్లో అన్ని అంశాలు ఉంటాయని, కేంద్ర ప్రభుత్వ వాటా, 9వ షెడ్యూల్ వివాదాన్ని ఏపీ ప్రభుత్వం డీల్ చేసిన మాదిరిగా ఇక్కడా చేస్తామన్నారు. ప్రస్తుత చట్టపరమైన సంస్థ రూపంలోనే ఆర్టీసీ పని చేస్తుందని వివరణ ఇచ్చారు.
ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ సానుకూలంగా స్పందించారన్నారు కార్మికసంఘాల నేత థామస్ రెడ్డి. రాజ్ భవన్ లో గవర్నర్ తో వీడియో కాన్ఫరెన్స్ లో చర్చలు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపిన ఆయన.. ఆర్టీసీ బిల్లును ఆమోదించాలని కోరామని చెప్పారు.
అభ్యంతరాలపై ప్రభుత్వం నుంచి వివరణ అందలేదని .. వివరణ అందాక గవర్నర్ ఆమోదిస్తామన్నారని థామస్ రెడ్డి చెప్పారు. సత్వర పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తున్నామని గవర్నర్ హమీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులను న్యాయం జరగాలని గవర్నర్ అన్నారన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పాసవుతుందన్న నమ్మకం ఉందన్నారు.