- ఆర్ఆర్ఆర్, తుమ్మిడిహెట్టి, ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్ ఫ్రంట్ను ప్రతిష్టాత్మక ప్రాజెక్టులుగా గుర్తించిన ప్రభుత్వం
 
హైదరాబాద్, వెలుగు: రానున్న మూడేండ్లలో పూర్తయ్యేలా 4 ప్రాజెక్టులను (ఫోర్ ప్రయారిటీస్) రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. రీజినల్ రింగ్ రోడ్డు, తుమ్మిడిహెట్టి బ్యారేజీ, ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని, ప్రతి వారం వాటి అప్డేట్ను తనకు అందజేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆయా శాఖల సెక్రటరీలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది.
పనులు ముందుకు సాగకపోతే, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవడంలో వెనకాడేది లేదని తేల్చి చెప్పారు. ఈ ‘ఫోర్ ప్రయారిటీస్’పై అధికార యంత్రాంగం ఫోకస్ చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టిసారించిన ప్రభుత్వం.. తెలంగాణ రూపురేఖలను మార్చేయగల ఈ 4 ముఖ్యమైన ప్రాజెక్టులకు డెడ్లైన్ పెట్టుకునే పనులు పూర్తవుతాయని భావిస్తున్నది.
ఇదీ.. 4 ప్రాజెక్టుల స్టేటస్
రీజినల్ రింగ్ రోడ్డులో ఉత్తర భాగానికి మిగిలిపోయిన భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని, పరిహారం చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఇప్పటికే దక్షిణ భాగానికి సంబంధించిన డీపీఆర్ పూర్తయింది. తుమ్మిడిహట్టి బ్యారేజీ విషయమై మహారాష్ట్రతో పెండింగ్లో ఉన్న అంతర్రాష్ట్ర సమస్యలను పరిష్కరించడానికి ఉన్నతాధికారుల బృందం చర్చలు జరుపుతున్నది.
త్వరలోనే సీఎం.. మహారాష్ట్రకు వెళ్లనున్నారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ను ఆకర్శించనున్న ఫ్యూచర్ సిటీ కోసం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన పనులను పర్యవేక్షిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ పరిపాలన బిల్డింగ్కు ఇటీవల భూమిపూజ చేయగా, ఈ డిసెంబర్లో ప్రారంభించనున్నారు. ఇక, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో బాపుఘాట్ దగ్గర పనులు, రక్షణ శాఖ భూములను తీసుకోవడంపై ఫోకస్ పెట్టారు. మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణ పనుల్లో జాప్యాన్ని తొలగించి, పర్యావరణ అనుమతులను త్వరితగతిన పూర్తి చేయాలని, పారిస్ తరహాలో రివర్ ఫ్రంట్ను తీర్చిదిద్దేందుకు విదేశీ నిపుణుల సహాయాన్ని తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నది.
