నాంపల్లిలోని పశుసంవర్దక శాఖ కార్యాలయంలో కీలకమైన ఫైల్స్ మాయమైన ఘటనను కాంగ్రెస్ సర్కార్ చాలా సీరియస్ గా తీసుకుంది. అంతేకాకుండా గొర్రెల పంపిణీలో జరిగిన అక్రమాలపై ఫోకస్ పెట్టింది. ఈ రెండు కేసులును ఏసీబీకి బదిలీ చేస్తూ రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. గొర్రెల పంపిణీ నగదు బదిలీల్లో ఉన్నతాధికారుల ప్రమేయం ఉందని తేలింది. దీంతో గచ్చిబౌలిలోని అధికారులపై కేసు నమోదైంది. పశుసంవర్దక శాఖ కార్యాలయంలో ఫైల్స్ మాయంపై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా వాటిని ఏసీబీకి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు కాగానే పలుచోట్ల ఫైళ్లు మాయం దగ్ధం కావడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ మాసబ్ ట్యాంక్ లోని పశు సంవర్ధక శాఖ ఆఫీసులోకి అక్రమంగా ప్రవేశించి, సిబ్బంది సహాయంతో బీరువాలో ఉన్న ఫైళ్లను చింపివేసి, కొన్ని ముఖ్యమైన ఫైల్స్ను తన కారులో తీసుకెళ్లాడు. ఈమేరకు వాచ్మెన్ మందాల లక్ష్మయ్య ఫిర్యాదుతో పోలీసులు కల్యాణ్, ఆపరేటర్ మోహన్ ఎలిజ, వెంకటేశ్, ప్రశాంత్లపై కేసు నమోదు చేశారు.
ఇక గొర్రెల పంపిణీ వ్యవహారంలో కూడా కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ పథకంలో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున నిధులను మళ్లించినట్లుగా గుర్తి్ంచింది. దీంతో పలువురు అధికారులపై కేసులు నమోదు కాగా తాజాగా ఈ కేసులను ఏసీబీక బదిలీ చేస్తూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.