![తెలంగాణను నిరుద్యోగ రాజధానిగా మార్చారు : పవన్ ఖేరా](https://static.v6velugu.com/uploads/2023/11/telangana-has-been-turned-into-unemployment-capital_e6JWju3fyp.jpg)
హైదరాబాద్, వెలుగు : వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్సర్కార్.. ప్రజలను నిలువునా వంచించిందని ఏఐసీసీ మీడియా ఇన్చార్జ్, సీడబ్ల్యూసీ మెంబర్ పవన్ ఖేరా మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం మోసం, అవినీతి, దుర్మార్గం, కమీషన్లు అనే నాలుగు చక్రాల మీదే నడుస్తున్నదని విమర్శించారు. నిరుద్యోగులను వెన్నుపోటు పొడిచిన కేసీఆర్.. రాష్ట్రాన్ని నిరుద్యోగ రాజధానిగా మార్చారని ఫైర్ అయ్యారు.
ఇలాంటి పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలని పిలుపునిచ్చారు. సోమవారం ఆయన పార్టీ రాష్ట్ర కమ్యూనికేషన్ ఇన్చార్జ్ అజయ్ కుమార్ ఘోష్, కుసుమ కుమార్, చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. ఫాంహౌస్లో కేసీఆర్ రాజభోగాలు అనుభవిస్తుంటే.. ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పవన్ ఖేరా విమర్శించారు. కేసీఆర్ను ప్రజలే ఇక ఫాంహౌస్కు పంపుతారని, ఆయన అక్కడే శాశ్వతంగా విశ్రాంతి తీసుకోవచ్చని చెప్పారు. ‘‘ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం ఒక్క 2020లోనే 3,600 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. టీఎస్పీఎస్సీ భ్రష్టు పట్టిపోయింది. పరీక్ష ఫీజుల పేరిట నిరుద్యోగుల నుంచి రూ.220 కోట్లు సర్కార్ దోచుకుంది. అయినా ఒక్క పరీక్షనూ సరిగ్గా నిర్వహించలేకపోయింది. ఆ డబ్బులన్నీ ఎక్కడికిపోయాయి. ఉద్యోగం రాలేదని ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే.. ఆమె క్యారెక్టర్పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు’’ అని ఆయన ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో సరైన మీట మీద నొక్కి కేసీఆర్ను ఇంటికి పంపాలని, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలను పవన్ ఖేరా కోరారు.