
- 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల అటవీ భూములను తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్ఐఐసీ)కి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. పది రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
ఐటీ, ఇతర అవసరాల కోసం ఎకరం రూ.75 కోట్ల చొప్పున ఆయా సంస్థలకు కేటాయించేలా కంచె గచ్చిబౌలి సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల అటవీ భూములను టీజీఐఐసీకి సర్కార్ కేటాయిస్తూ 2024, జూన్ 26న రెవెన్యూ శాఖ జీవో 54 జారీ చేసింది. దీన్ని వటా ఫౌండేషన్ (ఈఎన్పీవో) సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిల్ను యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజోయ్పాల్, జస్టిస్ రేణుకా యార డివిజన్ బెంచ్ సోమవారం విచారించింది.
సీనియర్ అడ్వకేట్ ఎస్.నిరంజన్రెడ్డి వాదిస్తూ.. 400 ఎకరాల భూమి రిజర్వ్ ఫారెస్ట్ది అని చెప్పారు. అరుదైన పలు జాతులతో సహా వివిధ రకాల వృక్షాలు, జంతువులకు నిలయంగా ఉన్నదని వివరించారు. ‘అడవి’అనే పదాన్ని ప్రభుత్వ రికార్డులు, చట్టపరమైన నోటిఫికేషన్లకే పరిమితం చేయకూడదన్న సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు జీవోను రద్దు చేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.