- డెంగీపై హైదరాబాద్లో కేంద్ర అధికారుల సమీక్ష
- సీఎస్ జోషి, స్పెషల్ సీఎస్ శాంతికుమారి, హెల్త్ ఆఫీసర్లతో భేటీ
- రెండే డెంగీ మరణాలు నమోదయ్యాయని సీఎస్ నివేదిక
- డెంగీ నివారణకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందన్న కేంద్ర బృందం
హైదరాబాద్, వెలుగు:
డెంగీ కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని సెంట్రల్ హెల్త్ ఆఫీసర్ల టీమ్ వెల్లడించింది. దేశంలో ఈ ఏడాది 76 వేల మంది డెంగీ బారిన పడగా, 58 మరణాలు రికార్డ్ అయ్యాయని, కర్నాటకలో అత్యధికంగా 13,200 కేసులు, 12 మరణాలు.. తెలంగాణలో 8,516 కేసులు, 2 మరణాలు నమోదయ్యాయని వివరించింది. నేషనల్ వెక్టార్ బోర్న్, డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్(ఎన్వీబీడీసీపీ) డిప్యూటీ డైరెక్టర్, తెలంగాణ నోడల్ ఆఫీసర్ డాక్టర్ సుమన్ లత నేతృత్వంలో ఎన్వీబీడీసీపీ కన్సల్టెంట్ డాక్టర్ కౌశల్ కుమార్, ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్(ఐడీఎస్పీ) డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ప్రణవ్ కుమార్ వర్మ, ఎపిడమాలజీ కన్సల్టెంట్ సాహిత్ గోయల్ బృందం శుక్రవారం బీఆర్కే భవన్లో సీఎస్ ఎస్కే జోషి, హెల్త్ స్పెషల్ సీఎస్ శాంతికుమారితో సమావేశమైంది. డెంగీ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను, ప్రస్తుత పరిస్థితిని అధికారులు ఈ టీమ్కు వివరించారు.
డెంగీ కేసులు, మరణాలపై ఓ నివేదికను సమర్పించారు. రాష్ట్రంలో ఈ ఏడాది 8,516 డెంగీ కేసులు, రెండు డెంగీ మరణాలు నమోదైనట్టు అందులో పేర్కొన్నారు. దోమల నివారణకు జీహెచ్ఎంసీ వాడుతున్న యంత్రాలపై కేంద్ర అధికారులు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.
మరిన్ని చర్యలు తీసుకోవాల్సింది
సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణలో లోపాలు కనిపిస్తున్నాయని, ఇంప్రూవ్ చేసుకోవాలని డాక్టర్ సుమన్ లత అభిప్రాయపడ్డారు. సీఎస్తో మీటింగ్ తర్వాత వెలుగు ప్రతినిధితో మాట్లాడుతూ.. డెంగీ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందన్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ మాత్రమే పని చేస్తే డెంగీని నివారించలేమని, మిగిలిన శాఖలు కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది అధిక వర్షపాతం, ఎక్కువ రోజులు చలి వాతావరణం ఉండడంతో చాలా రాష్ట్రాల్లో డెంగీ కేసులు పెరిగాయని, తెలంగాణలో ఇంకా ఎక్కువగా ఉన్నాయని డాక్టర్ కౌశల్కుమార్ వివరించారు. డెంగీ నివారణకు ప్రజలు కూడా కృషి చేయాలని, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వకుండా చూసుకోవాలని సూచించారు. డెంగీతో ఈ ఏడాది ఇద్దరే చనిపోయారని రాష్ట్ర అధికారులు నివేదిక ఇచ్చారని, సస్పెక్టెడ్ డెంగీ డెత్స్ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని కౌశల్ చెప్పారు.
రోగాల నివారణపై దృష్టి పెట్టండి
డెంగీ, మలేరియా తదితర వెక్టార్ బోర్న్ రోగాల నివారణకు కార్యాచరణ రూపొందించాలని హెల్త్ ఆఫీసర్లను సీఎస్ జోషి ఆదేశించారు. దోమల బ్రీడింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టి, వాటిని నివారించేందుకు సరైన యంత్రాలను ఉపయోగించాలన్నారు. కేంద్రం నుంచి వచ్చిన హెల్త్ ఆఫీసర్ల బృందంతో ఆయన శుక్రవారం బీఆర్కే భవన్లో సమావేశమయ్యారు. తర్వాత సీఎస్ అధికారులతో మాట్లాడుతూ.. జ్వరాల నివారణకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ఫాగింగ్ను సరైన పద్ధతిలో, సరైన యంత్రాలతో చేయాలని సూచించారు.దోమల వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించాలన్నారు.