శ్రీశైలం రైట్​ మెయిన్​ కెనాల్ కెపాసిటీ పెంచుతున్నా పట్టించుకోరా?

శ్రీశైలం రైట్​ మెయిన్​ కెనాల్ కెపాసిటీ పెంచుతున్నా పట్టించుకోరా?
  •  
  • కృష్ణా బోర్డుకు తెలంగాణ సర్కారు లేఖ
  • లైనింగ్​ పూర్తయితే పోతిరెడ్డిపాడు నుంచి నీటిని డ్రా చేసే కెపాసిటీ పెరుగుతది
  • తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోతదని ఆందోళన
  • వెంటనే ఎస్ఆర్ఎంసీ  లైనింగ్​ పనులు ఆపాలని డిమాండ్

​హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం రైట్​ మెయిన్​ కెనాల్​ (ఎస్ఆర్ఎంసీ) లైనింగ్​ పనులపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.  పనులను పునరుద్ధరించి నెలలు గడుస్తున్నా అడ్డుకోవాల్సిన కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు (కేఆర్​ఎంబీ) చోద్యం చూస్తున్నదని మండిపడింది.  ‘‘ఏపీ అక్రమంగా లైనింగ్​ పనులు చేపట్టి సామర్థ్యం పెంచుకుంటున్నా పట్టించుకోరా?’’ అంటూ నిలదీసింది. ఈ మేరకు 5 రోజుల క్రితం కేఆర్ఎంబీకి తెలంగాణ రాసిన లేఖ తాజాగా బయటకొచ్చింది.  శ్రీశైలం రైట్​ మెయిన్​ కెనాల్​ లైనింగ్​ పనులను ఆపాలని ఎన్నిసార్లు కృష్ణా బోర్డును కోరినా.. ఏపీని నిలువరించడం లేదని అసహనం వ్యక్తం చేసింది. కృష్ణా బోర్డు నిర్లక్ష్యం వల్ల ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్​ రెగ్యులేటర్​కు దిగువన ఎస్ఆర్ఎంసీ లైనింగ్​ పనులను స్పీడప్​ చేసిందని ఆరోపించింది. ఈ పనులు పూర్తయితే.. పోతిరెడ్డిపాడు హెడ్​ రెగ్యులేటర్​నుంచి నీటిని డ్రా చేసే సామర్థ్యం పెరుగుతుందని, అపెక్స్​ కౌన్సిల్​ అనుమతులు, కృష్ణా బోర్డు ఆమోదం లేకుండా ఏపీ ఈ పనులను చేపట్టడానికి వీలులేదని పేర్కొన్నది. ఈ నేపథ్యంలోనే ఎస్ఆర్ఎంసీ లైనింగ్​ పనులను ఏపీ ఆపేసేలా వెంటనే కృష్ణా బోర్డు ఆదేశాలివ్వాలని, లేదంటే ఇప్పటికే తెలంగాణ కరువు నేలల్లో వ్యవసాయం చేస్తున్న రైతులకు పెను నష్టం జరిగే ప్రమాదం ఉంటుందని రాష్ట్ర సర్కారు తెలిపింది. 

ఇన్​బేసిన్​కే ఉండాలె..

కృష్ణా పరివాహకంలోని ఇన్​సైడ్​ బేసిన్​ ప్రాజెక్టులకే నీటిని తీసుకెళ్లాలని బచావత్​ ట్రిబ్యునల్​ స్పష్టంగా ఆదేశాలిచ్చిందని కృష్ణా బోర్డుకు తెలంగాణ సర్కారు మరోసారి గుర్తు చేసింది. మరోవైపు శ్రీశైలం జలవిద్యుత్​ ప్రాజెక్ట్​ కాబట్టి ఔట్​సైడ్​ బేసిన్​కు నీటిని తరలించరాదని బచావత్​ ట్రిబ్యునల్​ స్పష్టం చేసిందని పేర్కొన్నది. అయితే, 1976/77 చెన్నైకి తాగునీటి సరఫరా కోసం శ్రీశైలం నుంచి 1500 క్యూసెక్కుల నీటి తరలింపునకు ఓపెన్  కెనాల్​ కు మాత్రమే అనుమతిచ్చారని తెలిపింది. కానీ, అందుకు విరుద్ధంగా ఏపీ వ్యవహరిస్తున్నదని అసహనం వ్యక్తం చేసింది. ‘‘బచావత్​ ట్రిబ్యునల్​ అవార్డుకు విరుద్ధంగా శ్రీశైలం రైట్​ బ్యాంక్​ కెనాల్​ (ప్రస్తుత పోతిరెడ్డిపాడు) అనుమతుల కోసం సీడబ్ల్యూసీకి దరఖాస్తు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కేవలం ఒక ప్రాంతంగా ఉండడంతో సీడబ్ల్యూసీ ముందుగానీ.. ట్రిబ్యునల్​లో గానీ వాదనలు వినిపించేందుకు అవకాశం దక్కలేదు. మహారాష్ట్ర, కర్నాటకలు 2,130 టీఎంసీలకుపైన మిగులు జలాలపైనే అభ్యంతరాలున్నాయి. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలపై ఎలాంటి అభ్యంతరాలు లేవు’’ అని పేర్కొన్నది. 

చెన్నైకి వాటర్​ ముసుగులో దోపిడీ..

మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు అభ్యంతరాలు చెప్పకపోవడంతో ఏపీ రెచ్చిపోయిందని  లేఖలో తెలంగాణ సర్కారు ఆక్షేపించింది. చెన్నైకి తాగునీటి ముసుగులో జలదోపిడీకి తెరదీసిందని పేర్కొన్నది. ‘‘చెన్నై తాగునీటి సరఫరా ముసుగులో 1980లో  ఏపీ 44,600 క్యూసెక్కుల కెపాసిటీతో పోతిరెడ్డి పాడు హెడ్​ రెగ్యులేటర్​, 19,150 క్యూసెక్కుల కెపాసిటీతో లైనింగ్​ లేకుండా శ్రీశైలం రైట్​ మెయిన్​ కెనాల్​, 48,525 క్యూసెక్కుల సామర్థ్యంతో బనకచర్ల క్రాస్​ రెగ్యులేటర్ల నిర్మాణానికి తెరలేపింది. ఇక, 2005లో పోతిరెడ్డిపాడు కెపాసిటీని 1,56,100 క్యూసెక్కులకు, ఎస్ఆర్ఎంసీ అన్​లైన్డ్​ కెనాల్​ కెపాసిటీ 44 వేల క్యూసెక్కులకు, బనకచర్ల క్రాస్​ రెగ్యులేటర్​ కెపాసిటీని 81,975 క్యూసెక్కులకు పెంచింది. ఆ తర్వాత 2020 మే 5న ఎస్ఆర్ఎంసీ కెపాసిటీని 89,762 క్యూసెక్కులకు పెంచేలా లైనింగ్​ పనులను చేపట్టేందుకు జీవో 203ని జారీ చేసింది. ఆ జీవో ఆధారంగానే ఎస్ఆర్ఎంసీ లైనింగ్, కొత్త విస్తరణ పనులను ఏపీ చేపడుతున్నది. దీనిపై ఫిర్యాదు చేసినా కృష్ణా బోర్డు అప్పటి నుంచి చోద్యం చూస్తున్నది’’ అని   లేఖలో తెలిపింది.