- సాగర్ కాల్వల కెపాసిటీల్లో ఎక్కువ, తక్కువలా?
- నీటి తరలింపుల్లో తేడాలను సరిచేయాలె.. కేఆర్ఎంబీకి తెలంగాణ లెటర్
హైదరాబాద్, వెలుగు: నాగార్జునసాగర్ కుడి, ఎడమకాల్వల హెడ్రెగ్యులేటర్ల నుంచి నీటిని తరలించడంలో ఉన్న తేడాల్ని సరిచేయాల్సిందిగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. సాగర్లో 510 అడుగుల వద్ద నీళ్లుంటే ఎడమ కాల్వ నుంచి కేవలం 7,889 క్యూసెక్కుల తరలింపుకే చాన్స్ ఉంటుందని, అదే కుడి కాల్వ నుంచి 500 అడుగుల స్థాయిలోనూ 24,606 క్యూసెక్కులను తీసుకోవచ్చని బోర్డు చైర్మన్ ఎస్పీ సింగ్కు బుధవారం రాసిన లేఖలో ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ పేర్కొన్నారు. 1952లో ఆంధ్ర, హైదరాబాద్ స్టేట్లు చేసుకున్న ఒప్పందం ప్రకారం సాగర్ కుడి, ఎడమ కాల్వల నుంచి నీటి విడుదల సమానంగా జరగాలని గుర్తు చేశారు. ఏపీతో కలిసి ఉన్నప్పుడు రెండు రెగ్యులేటర్ల నిర్మాణాల్లో అన్యాయం చేశారని, ఎక్కువ తక్కువలతో రెగ్యులేటర్లను కట్టారని పేర్కొన్నారు. ఈ విషయంలో బోర్డు వెంటనే జోక్యం చేసుకుని 510 అడుగుల వద్ద కూడా 11 వేల క్యూసెక్కుల నీళ్లను తీసుకునేలా ఎడమ కాల్వ రెగ్యులేటర్ను పెంచాలని విజ్ఞప్తి చేశారు. కుడి కాల్వ కెపాసిటీనీ అదే లెవెల్లో 11 వేల క్యూసెక్కులకు తగ్గించాలన్నారు. కుడి కాల్వ కింద ఉన్న ఆయకట్టుకు వేరే మార్గాల్లోనూ ఏపీ సర్కారు నీటిని తరలించుకునే అవకాశం ఉందని, కాబట్టి కృష్ణా బేసిన్లో తెలంగాణ ఎక్కువ నీటిని వాడుకునేందుకు అవకాశమివ్వాలని మురళీధర్ కోరారు. ఇదే విషయంపై బ్రజేశ్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తున్నామన్నారు.