హైదరాబాద్, వెలుగు: ఏపీకి చెందిన ఓ విద్యార్థి నికి తెలంగాణ లోకల్ సర్టిఫికెట్ ఇచ్చిన ఆఫీస ర్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెన్నెల అనే స్టూడెంట్ ఏపీలో ఇంటర్ వరకు చదువుకున్నారు. తెలంగాణలో ఎంబీబీఎస్లో అడ్మిషన్ పొందేందుకు రెసిడెన్స్ సర్టిఫికెట్ అవసరమైంది. గద్వాల్ జిల్లా అలంపూర్ తహసీల్దార్ ఆఫీసులో అప్లై చేసుకోగా తెలంగాణ స్థానికతతో సర్టిఫికెట్ వచ్చింది. అయినా ఆమెకు లోకల్ కోటాలో ఎంబీబీఎస్ సీటు ఇచ్చేందుకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నిరాకరించింది.
దాంతో వెన్నెల హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనల ప్రకారం లోకల్గా పరిగణించాలంటే అర్హత పరీక్ష(నీట్)కు ముందు నాలుగేండ్లు తెలంగాణలోనే చదివి ఉండాలి. పిటిషనర్ వెన్నెల ఒకటి నుంచి ఇంటర్ వరకు ఏపీలో చదివినా ఆమెకు ఇక్కడ లోకల్ సర్టిఫికెట్ ఇవ్వడంపై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. అలంపూర్ తహసీల్దార్ మంజుల హాజరు కాగా.. ఏపీ స్టూడెంటుకు తెలంగాణ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారని ఆమెను కోర్టు నిలదీసింది. అధికారులు ఇచ్చిన వివరణపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణను డిసెంబర్ 4కు వాయిదా వేస్తూ.. తహసీల్దార్తో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.