
- ప్రభుత్వ గైడ్ లైన్స్ వెల్లడించిన ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ కాంతారావు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గృహ, వాణిజ్య, పారిశ్రామిక, సాఫ్ట్వేర్ రంగాల్లోని భవనాల్లో విద్యుత్, అగ్ని ప్రమాదాలను నివారించేందుకు తప్పనిసరి భద్రతా చర్యలను అనుసరించాలని తెలంగాణ ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డ్ కార్యదర్శి, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ టీ. కాంతారావు సూచించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం జారీ చేసిన విద్యుత్ భద్రతా మార్గదర్శకాలను వెల్లడించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. ‘‘ప్రతి విద్యుత్ కనెక్షన్ కు కనీసం రెండు ఎర్త్ పిట్లు నిర్మించాలి.
గృహాలకు కనీసం ఒక ఎర్త్ పిట్ తప్పనిసరి. ప్రతి ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్లో 30 మిల్లియామ్స్ సామర్థ్యం కలిగిన రెసిడ్యూవల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్ (ఆర్సీసీబీ) లేదా ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ (ఈఎల్సీబీ) పరికరాలను ఏర్పాటు చేయాలి. ఈ పరికరాలు సర్క్యూట్లో లీకేజ్ కరెంట్ను గుర్తించి, ఆటోమేటిక్గా ట్రిప్ చేస్తాయి. దీనివల్ల విద్యుత్ ప్రమాదాలను నివారించవచ్చు. బహుళ అంతస్తుల భవనాల్లో కనీసం నాలుగు లైటనింగ్ కండక్టర్లను ఏర్పాటు చేయాలి. అన్ని ఎలక్ట్రికల్ పనులను లైసెన్స్ పొందిన కాంట్రాక్టర్ల ద్వారానే నిర్వహించాలి’’ అని కాంతారావు సూచించారు.