స్టూడెంట్స్ డ్రగ్స్పై పోరాడాలి : కమిషనర్ అంబర్ కిశోర్ ఝా

 స్టూడెంట్స్ డ్రగ్స్పై పోరాడాలి : కమిషనర్ అంబర్ కిశోర్ ఝా
  • మత్తు పదార్థాల నిర్మూలనలో భాగస్వాములు కావాలి
  • అవేర్నెస్​ కార్యక్రమాల్లో అధికారులు

ఆదిలాబాద్/నిర్మల్/జైపూర్/లక్సెట్టిపేట, వెలుగు: మత్తు పదార్థాలకు ఆకర్షితులు కావద్దని, ఉన్నత లక్ష్యాలు ఎంచుకొని వాటిని చేరుకునేందుకు కృషి చేయాలని విద్యార్థులకు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. మత్తు పదార్థాల నిర్ములన వారోత్సవాల్లో భాగంగా జైపూర్​మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో స్టూడెంట్లకు అవగాహన కల్పించారు. డ్రగ్స్ నిర్మూలన విద్యార్థులు, యువత చేతిలోనే ఉందన్నారు. 

మత్తు పదార్థాలను అరికట్టేందుకు యాంటీ డ్రగ్స్ కమిటీల్లో సభ్యులుగా చేరి యాంటీ డ్రగ్స్ సోల్జర్స్​గా సేవలందించాలని కోరారు. డ్రగ్స్​నిర్మూలనపై రూపొందించిన పోస్టర్లను విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు. వారితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ స్పెషల్ బ్రాంచ్, ట్రాఫిక్ ఏసీపీలు వెంకటేశ్వర్లు, మల్లారెడ్డి, శ్రీనివాస్, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

మత్తు పదార్థ రహిత సమాజ ఏర్పాటుకు చర్యలు: ఆశావాణిలో కలెక్టర్

మత్తు పదార్ధ రహిత సమాజ ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఆకాశవాణి నిర్వహించిన ఇంటర్వ్యూలో డ్రగ్స్ నిర్మూలనపై మాట్లాడారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా, వాడకం వల్ల కలిగే దుష్పరిణామల గురించి ప్రజల్లో చైత్యన్యం తీసుకొచ్చేందుకు చేపడుతున్న కార్యక్రమాల గురించి పంచుకున్నారు.

మత్తు పదార్థాల అనర్థాలపై అవగాహన కల్పించడంతో పాటు, అరికట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. డ్రగ్స్​వినియోగం, రవాణా సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్లు 1098, 14446 తెలియజేయాలన్నారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రజలతో కలిసి యుద్దం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. యాంటీ డ్రగ్ వీక్​లో భాగంగా ఆదిలాబాద్​లోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ పాఠశాల నందు డ్రగ్స్ కు వ్యతిరేకంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమం పాల్గొని మాట్లాడారు. డ్రగ్స్ నిర్మూళనపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, సీఐలు పాల్గొన్నారు.

 బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్​లో అవేర్నెస్ 

విద్యార్థులు, యువత డ్రగ్స్ నిర్మూలన కార్యక్ర మంలో భాగస్వాములై ప్రజలందరినీ చైతన్యవంతులను చేయాలని నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల కోరారు. బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో నిర్వహించిన యాంట్రీ డ్రగ్ అవేర్నెస్ వారోత్సవాల్లో ఎస్పీ పాల్గొన్నారు. విద్యార్థి దశ ఎంతో కీలకమైందని, ఈ దశలో గంజాయితోపాటు ఇతర మత్తు పదార్థాల బారిన పడితే భవిష్యత్ అంధకారమవుతుందన్నారు. డ్రగ్స్ ఆరోగ్యంతోపాటు జీవితాన్ని, కుటుంబాన్ని నాశనం చేస్తుందన్నారు. జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆర్జీయూకేటీ వీసీ గోవర్ధన్, భైంసా అడిషనల్ ఎస్పీ అవినాశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

యువత గంజాయికి దూరంగా ఉండాలి 

 యువత గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా వాటికి దూరంగా ఉండాలని లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి సూచించారు. పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో ఉట్కూర్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు గల రద్దీ  ప్రాంతాల్లో మంగళవారం నార్కోటిక్ డాగ్ తో తనిఖీలు నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ.. గంజాయి తాగినా, అమ్మినా నేరమన్నారు. రాష్ట్రాన్ని గంజాయి రహితంగా తయారుచేసేందుకు ప్రభుత్వం నిత్యం కృషి చేస్తోందని, ఇందులో భాగంగా పోలీసులు నిత్యం సోదాలు చేస్తున్నారని తెలిపారు.